రూ.20 వేలకోట్ల బ్యాంక్ మోసం కేసులో ఆమ్టెక్ గ్రూప్, డైరెక్టర్ల ఆస్తులపై ఈడీ దాడులు

మనీలాండరింగ్ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం ఆమ్టెక్ గ్రూప్, దాని డైరెక్టర్లకు చెందిన ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబై, నాగ్‌పూర్‌లోని 35 స్థలాల్లో సోదాలు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

Update: 2024-06-20 07:33 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: మనీలాండరింగ్ కేసులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గురువారం ఆమ్టెక్ గ్రూప్, దాని డైరెక్టర్లకు చెందిన ఢిల్లీ-ఎన్‌సిఆర్, ముంబై, నాగ్‌పూర్‌లోని 35 స్థలాల్లో సోదాలు చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. రూ. 20,000 కోట్లకు పైగా బ్యాంకు రుణం మోసానికి పాల్పడినట్లు కంపెనీ, దాని ప్రమోటర్లపై ఆరోపణలు రావడంతో సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయగా ఆ తరువాత ఈడీ దర్యాప్తులోకి చేరింది. గురువారం ఉదయం ఆమ్టెక్ గ్రూప్, అరవింద్ ధామ్, గౌతమ్ మల్హోత్రాకు చెందిన వ్యాపారాలు, నివాస స్థలాలపై దాడులు జరిగాయి.

లిస్టెడ్ కంపెనీల షేర్లలో అవకతవకలు జరిగాయని ఆడిటర్ల సహకారంతో ఫైనాన్షియల్ రికార్డులు తారుమారు చేసి అధిక రుణాలు పొందడానికి మోసానికి పాల్పడ్డారని ఆమ్టెక్ గ్రూప్, అరవింద్ ధామ్, గౌతమ్ మల్హోత్రా పై ఈడీ కేసు నమోదు చేసింది.ఆ తర్వాత విచారణ చేయగా, రుణ నిధులను అక్రమంగా రియల్ ఎస్టేట్, విదేశీ పెట్టుబడులు, కొత్త వెంచర్ల వైపు మళ్లించినట్లు, షెల్ కంపెనీల పేరుతో వేల కోట్ల ఆస్తులు దాచిపెట్టారని దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటికి కూడా బినామీ డైరెక్టర్లు, షేర్ హోల్డర్ల ద్వారా కొత్త పేర్లతో లావాదేవీలు చేస్తున్నారని ఈడీ గుర్తించింది.


Similar News