Lenovo: ఇండియాలో లెనోవా AI సర్వర్లు

ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవా(Lenovo) ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సర్వర్లను తయారు చేయడం ప్రారంభించింది

Update: 2024-09-18 14:05 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ కంప్యూటర్ల తయారీ కంపెనీ లెనోవా(Lenovo) ఇండియాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సర్వర్లను తయారు చేయడం ప్రారంభించింది. పుదుచ్చేరిలోని తన ప్లాంట్‌లో 50,000 ఎంటర్‌ప్రైజ్ AI ర్యాక్ సర్వర్‌లను, 2,400 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ల(GPU) ఉత్పత్తిని మొదలుపెట్టంది. ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి అయిన సర్వర్లు, దేశీయంగా ఉపయోగించుకోవడంతో పాటు ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి వీలవుతుంది. మొత్తం ఉత్పత్తి అయిన వాటిలో దాదాపు 60 శాతం ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి ఎగుమతి అవుతాయి. కంపెనీ ఉన్నతాధికారి మాట్లాడుతూ, ప్రభుత్వ ప్రోత్సాహక పథకం కింద దేశంలో AI సర్వర్‌లను తయారు చేసిన మొదటి కంపెనీలలో Lenovo ఒకటిగా ఉంటుందని అన్నారు.

మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా లెనోవా చైనా, తైవాన్ నుంచి తన తయారీ సామర్థ్యాన్ని క్రమంగా భారత్‌కు షిప్ట్ చేస్తుంది. ఇటీవల కాలంలో AI వినియోగం పెరిగిన నేపథ్యంలో దానికి అనుగుణంగా డిమాండ్ తీర్చడానికి ఈ సర్వర్లు బాగా ఉపయోగపడనున్నాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) హార్డ్‌వేర్ కోసం భారత ప్రభుత్వ ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) పథకాన్ని ఉపయోగించుకుని లెనోవా ఇండియాలో తన పెట్టుబడులు పెంచుతుంది. AI ప్లాట్‌ఫారమ్‌లు, కంప్యూటింగ్ పరికరాలు, సర్వర్‌లను అభివృద్ధి చేయడానికి గత సంవత్సరం ప్రకటించిన $1-బిలియన్ పెట్టుబడి నేపథ్యంలో సర్వర్‌లను తయారు చేస్తుంది.


Similar News