వైవీ సుబ్బారెడ్డికి ఘోర పరాభవం.. కీలక సమయంలో చేతులెత్తేసిన మాజీలు

విశాఖ జిల్లాలో ఓటమి నుంచి వైపీపీ నేతలు ఇంకా బయటపడలేదు....

Update: 2024-07-08 02:03 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: ఓటమి నుంచి వైపీపీ నేతలు ఇంకా బయటపడలేదు. పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త ఏర్పాటు చేసిన సమావేశానికి కూడా హాజరుకావడం లేదు. విశాఖపట్నం ఎండాడ పార్టీ కార్యాలయంలో ఆదివారం అనకాపల్లి జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాలు జరగాయి. ముఖ్యనేతలు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు పలువురు మోహం చాటేయడంతో పేలవంగా సమావేశాలు జరిగాయి. ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, వైసీపీ పార్లమెంటరీ నేత వైవి సుబ్బారెడ్డి నిర్వహించిన ఈ సమావేశాలకే పలువురు హాజరుకాలేదు.

విశాఖ సమావేశానికి వచ్చింది ఇద్దరే అభ్యర్ధులు..

విశాఖ జిల్లా సమావేశానికి ఎంపీ అభ్యర్ధి బొత్స ఝాన్సీ పాటు నలుగురు ఎమ్మెల్యే అభ్యర్ధులు హాజరుకాలేదు. భీమిలికి చెందిన మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ , విశాఖ తూర్పు అభ్యర్ధి, మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, దక్షిణ అభ్యర్ధి మాజీ శాసనసభ్యుడు వాసుపల్లి గణేష్ కుమార్, పశ్చిమ అభ్యర్ధి ఆడారి ఆనంద్‌లతో పాటు, కార్పోరేషన్ల మాజీ చైర్మన్‌లు, ముఖ్యనేతలు పలువురు గైర్హాజరయ్యారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీటు ఆశిస్తున్న గాజువాక అభ్యర్ధి అయిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్‌తో పాటు ఉత్తర నుంచి పోటీ చేసిన కేకే రాజు, గాజువాక మాజీ ఎం‌ఎల్‌ఏ తిప్పల నాగిరెడ్డిలు మాత్రమే హాజరయ్యారు.

అనకాపల్లి సమావేశానికి బూడి, ధర్మశ్రీ డుమ్మా

అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేసిన మాజీ ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, చోడవరం మాజీ ఎంఎల్ఏ కరణం ధర్మశ్రీ, యలమంచిలి మాజీ ఎంఎల్ఏ కన్నబాబు రాజు తదితరులు గైర్హాజరయ్యారు. రూరల్ జిల్లాకు చెందిన ముఖ్యనేతలు పలువురు హాజరుకాకపోవడంతో మొక్కు బడిగా సమావేశాలు సాగాయి.

అమర్‌నాథ్ ఎమ్మెల్సీ సీటు కోసమే ఆ కొద్దిమందైనా..

ఎన్నికల్లో రాష్ర్టంలో అత్యంత దారుణంగా రికార్డు స్ధాయిలో 95 వేల ఓట్లతో ఓడిపోయిన గుడివాడ అమర్నాధ్‌కు రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఇప్పించే ప్రయత్నాల్లో భాగంగా ఆయన మద్దతు దారులు పలువురిని సమావేశానికి రప్పించినట్లు తెలిసింది. నెల రోజులుగా పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరంగా ఉన్న వీరు ఆదివారం సమావేశానికి వచ్చి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరపున అభ్యర్ధిని నిలపాలనే డిమాండ్ చేశారు.

ఓడిపోయిన వారికి సీటు వద్దు: కన్నబాబు

సమావేశానికి హాజరుకానప్పటికీ వైసీపీ కనుక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకొంటే ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన వారికి గాక కొత్త వారికి సీటును కేటాయించాలని యలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబు రాజు డిమాండు చేస్తున్నారు. ఓడిపోయిన వారికి ఇచ్చేకంటే కొత్తవారికి ఇస్తే పార్టీకి మైలేజ్ ఉంటుందని ఆయన అధిష్టానానికి తన అభిప్రాయాన్ని తెలియజేశారు.


Similar News