చంద్రబాబును అరెస్ట్ చేసినందుకు వైసీపీ మూల్యం చెల్లించుకోక తప్పదు: టీడీపీ ఇన్‌చార్జి బేబినాయన

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును వైసీపీ ప్రభుత్వం పైశాచిక ఆనందం కోసమే అరెస్ట్ చేసిందని బొబ్బిలి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి బేబినాయన అన్నారు.

Update: 2023-10-15 12:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును వైసీపీ ప్రభుత్వం పైశాచిక ఆనందం కోసమే అరెస్ట్ చేసిందని బొబ్బిలి నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి బేబినాయన అన్నారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగానే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. బొబ్బిలి కోటలో ఆదివారం బేబినాయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు పట్ల వైసీపీ ప్రభుత్వం మానవత్వం లేకుండా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువులకు తూట్లు పొడిచి మరీ చంద్రబాబును జైలుకు పంపిందని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను మేనేజ్ చేస్తోందంటూ మండిపడ్డారు. చంద్రబాబు బరువుపై జైలు అధికారులు, వైద్యులు విభిన్న ప్రకటనలు చేస్తున్నారన్నారు. చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబుకు చికిత్స అందించకుండా హేళన చేసేలా వైసీపీ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏదేశంలో లేని రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తుందని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడును వైసీపీ ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేయించిందని భవిష్యత్‌లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. స్కిల్ డవలప్‌మెంట్ కేసులే కాకుండా వైసీపీ అక్రమంగా పెట్టిన అన్ని కేసుల నుంచి చంద్రబాబు నాయుడు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని బేబినాయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై వైసీపీ చేస్తున్న విమర్శలు సిగ్గుచేటన్నారు. రాజకీయ విమర్శలకు సమాధానం చెప్పే సత్తా లేకనే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని టీడీపీ ఇన్‌చార్జి బేబినాయన మండిపడ్డారు.

Tags:    

Similar News