AP News:వైసీపీ అడ్రస్ గల్లంతు..ఆ నియోజకవర్గంలో దూసుకుపోతున్న అధికార పార్టీ మంత్రి

రామచంద్రపురం గోదావరి జిల్లాల రాజకీయాలకు కేంద్ర బిందువు. ఇక్కడ ఏది జరిగినా వైరల్ అవుతుంది.

Update: 2024-08-27 01:55 GMT

దిశ ప్రతినిధి,కోనసీమ:రామచంద్రపురం గోదావరి జిల్లాల రాజకీయాలకు కేంద్ర బిందువు. ఇక్కడ ఏది జరిగినా వైరల్ అవుతుంది. రాష్ట్ర రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపేస్తుంది. అంతటి రాజకీయ ప్రాధాన్యత గల నియోజకవర్గంలో వైసీపీ జాడ లేకుండా పోయింది. మొన్నటి దాకా చక్రం తిప్పిన నేతలు మౌన వ్రతం పాటిస్తున్నారు. అయితే అధికార పార్టీ మంత్రి వాసంశెట్టి సుభాష్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు.

మొన్నటిదాకా చెల్లుబోయిన..

రామచంద్రపురం నియోజకవర్గంలో మొన్నటి దాకా వైసీపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ చక్రం తిప్పారు. ఆయన రాజమండ్రి రూరల్‌కు వెళ్లిపోవడంతో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు సూర్య ప్రకాష్‌కు ఇంచార్జి బాధ్యతలు అప్పగించారు. అంతకుముందు తోట త్రిమూర్తులు చక్రం తిప్పారు.

కానరాని వైసీపీ..

నియోజకవర్గంలో ప్రస్తుతం వైసీపీ అడ్రస్ గల్లంతు అయిందనే చెప్పాలి. వైసీపీ కార్యకర్తలకు భరోసా ఇచ్చే నాయకుడే కరువయ్యాడు. గత ఎన్నికల్లో పిల్లి సూర్య ప్రకాష్ వైసీపీ నుంచి పోటీ చేసి కూటమి అభ్యర్థి సుభాష్ చేతిలో ఓడిపోయారు. అయితే ఓటమి పాలైన సూర్య ప్రకాష్ కార్యకర్తలకు అందుబాటులో లేరు. నిత్యం ఇతర ప్రాంతంలోనే ఉంటున్నారనేది ప్రధాన ఆరోపణ. దీంతో ఆయనను కలిసేందుకు వచ్చిన అనేక మంది కార్యకర్తలు విసుగెత్తి పోతున్నారు. ఇదిలా ఉండగా, మరలా మండపేట ఇంచార్జ్ తోట త్రిమూర్తులును ఇక్కడ ఇంచార్జిగా వేయనున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ మేరకు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుతో కలిసి మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది.

దూసుకుపోతున్న మంత్రి సుభాష్..

నియోజకవర్గంలో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి తొలి జాబితాలోనే మంత్రి పదవి సాధించిన వాసంశెట్టి సుభాష్ దూసుకుపోతున్నారు. ఆయన నియోజకవర్గంలో పేదలకు సొంత సొమ్ములు ఇస్తున్నారు. ఇటీవల లివర్ పాడైన బాలికకు ఆర్థిక సాయం చేశారు. కుయ్యేరులో యాక్సిడెంట్ అయిన టీడీపీ కార్యకర్తకు సాయం చేశారు. ఇలా నిత్యం అనేక మందికి సాయం చేస్తూ వస్తున్నారు. దీంతో అన్ని వర్గాల వారు సుభాష్‌ను ఆదరిస్తున్నారు.


Similar News