గోదావరిలో నిలిచిన లాంచీలు..కారణం ఏంటంటే?
గోదావరి వరద ఉధృతి పెరుగుతుండడంతో నదిలో ప్రజల కోసం నడిపే లాంచీలను అధికారులు నిలిపివేశారు.
దిశ, పోలవరం:గోదావరి వరద ఉధృతి పెరుగుతుండడంతో నదిలో ప్రజల కోసం నడిపే లాంచీలను అధికారులు నిలిపివేశారు. గోదావరి వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోందని సమాచారం రావడంతో పోలవరం కేంద్రం నుంచి తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తపట్నం వెళ్ళే లాంచీని పోలవరం రేవు వద్దే నిలిపివేశారు. ప్రతినిత్యం పెద్ద సంఖ్యలో పోలవరం నుంచి పురుషోత్తపట్నం, అలాగే పురుషోత్తపట్నం నుండి పోలవరం ప్రయాణికులు లాంచీలో ప్రయాణించి చేరుకుంటున్నారు.
పోలవరానికి ఆవలి ఒడ్డున ఉన్న పురుషోత్తపట్నం వారు ఇటు వైపు రావడం నిత్యం జరుగుతుంటుంది. దీంతో పోలవరం నుంచి పురుషోత్తపట్నం వెళ్లేందుకు ఇప్పుడు ప్రయాణికులు రాజమండ్రి, సీతానగరం, మీదుగా పురుషోత్తపట్నం చేసుకోవాల్సి వస్తుంది. మరోవైపు పోలవరం మండలం పట్టిసీమ వద్ద గోదావరి నదీ గర్భంలో ఉన్న శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి వారి ఆలయానికి వెళ్లే లాంచీలను పట్టిసీమ రేవు వద్దే నిలిపివేశారు. దీంతో వీరేశ్వరస్వామి వారి దర్శనం చేసుకునేవారికి నిరాశ కలుగుతుంది.