AP News:కోకో రైతుల సమస్య పై సమర శంఖం.. ఆ తేదీల్లో ధర్నా

కోకో గింజలు కొనుగోలు సమస్య పై ఈనెల 24,25 తేదీల్లో ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించాలని కోకో రైతుల రాష్ట్ర సదస్సు పిలుపునిచ్చింది.

Update: 2025-03-20 13:35 GMT
AP News:కోకో రైతుల సమస్య పై సమర శంఖం.. ఆ తేదీల్లో ధర్నా
  • whatsapp icon

దిశ ప్రతినిధి, ఏలూరు: కోకో గింజలు కొనుగోలు సమస్య పై ఈనెల 24,25 తేదీల్లో ధర్నా, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించాలని కోకో రైతుల రాష్ట్ర సదస్సు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఎంపీలు ఎమ్మెల్యేలు, జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందించాలని సదస్సు నిర్ణయించింది. ఏలూరు జిల్లా పెదవేగి మండలం గాంధీనగర్ లోని సీతారామ కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో రైతుల రాష్ట్ర సదస్సు గురువారం జరిగింది. ఈ సదస్సుకు బొల్లు రామకృష్ణ, బోళ్ళ సుబ్బారావు,ఈడ్పుగంటి శ్రీనివాసరావు అధ్యక్షవర్గంగా వ్యవహరించారు.

సదస్సులో కోకో రైతుల సమస్యల పై చర్చించి పలు తీర్మానాలు చేశారు. రైతుల సమస్యను పరిష్కరించకపోతే కోకో గింజలు కొనుగోలు చేస్తున్న కంపెనీల గోడౌన్స్ ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సదస్సు నిర్ణయించింది. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.కేశవరావు మాట్లాడుతూ కోకో గింజలు కొనుగోలు సమస్య వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని కోకో గింజలు కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించకుంటే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు.

కోకో గింజలు కొనుగోలు కంపెనీలు సిండికేట్ గా మారి రైతులను దోపిడీ చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలో 75 వేల ఎకరాల్లో కోకో తోటల సాగు ఉందని,ఉమ్మడి గోదావరి జిల్లాలు, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్ పామ్ తోటల్లో కోకో అంతర పంటగా ఉందన్నారు. ప్రపంచ కోకో ఉత్పత్తిలో మన దేశం 20వ స్థానంలో ఉందన్నారు. మన దేశ అవసరాలకు తగిన విధంగా ఇక్కడ ఉత్పత్తి లేదని ఆయన అన్నారు. 80 శాతం కోకో ను ఇతర దేశాల నుంచి మన దేశం దిగుమతి చేసుకుంటున్నామన్నారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర చెల్లించాలని కేశవరావు డిమాండ్ చేశారు.

రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె. శ్రీనివాస్, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు మాట్లాడుతూ కోకో రైతులు సంఘటితంగా లేకపోవడంతో కంపెనీలు సిండికేట్ గా మారి ఇబ్బంది పెడుతున్నాయన్నారు. సదస్సులో విజయరాయి ఉద్యాన పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త మాధవీలత, పెదవేగి ఆయిల్ ఫెడ్ కర్మాగార పరిధిలోని ఆయిల్ పామ్ రైతు సంఘం అధ్యక్షులు ఉండవల్లి వెంకటరావు, ఉమ్మడి గోదావరి జిల్లాలు, కృష్ణా ఎన్టీఆర్, కోనసీమ తదితర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కోకో రైతులు హాజరయ్యారు.


Similar News