సైకిల్ పై వచ్చిన కమిషనర్..బస్సు ఎక్కిన మేయర్: ఫొటోస్ వైరల్

వారంలో ఒక్కరోజు ప్రజా రవాణాను ఉపయోగించి విశాఖ నగరంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు నగర ప్రజలు సహకరించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు.

Update: 2024-02-26 11:47 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: వారంలో ఒక్కరోజు ప్రజా రవాణాను ఉపయోగించి విశాఖ నగరంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు నగర ప్రజలు సహకరించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె తమ క్యాంపు కార్యాలయం నుంచి జీవీఎంసీ వరకు ప్రజా రవాణా అయిన ఏపీఎస్ఆర్టీసీ బస్సులో చేరుకోగా జీవీఎంసీ కమిషనర్ సీఎం.సాయి కాంత్ వర్మ తమ క్యాంపు కార్యాలయం నుంచి సైకిల్ పై జీవీఎంసీ కి చేరుకొని అందరికీ స్ఫూర్తినిచ్చారు. ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ, నగరంలో కాలుష్యం విపరీతంగా పెరుగుతున్న దృష్ట్యా కాలుష్య నియంత్రణకు జీవీఎంసీ యంత్రాంగం వారంలో ఒకరోజు ప్రజా రవాణాను ఉపయోగించే నిర్ణయం మేరకు జీవీఎంసీ ఉద్యోగులతో పాటు అందరు ప్రజా రవాణాను ఉపయోగిస్తున్నామన్నారు. ఎకో-వైజాగ్ అభివృద్ధి నేపద్యంలో ఎకో-జీరో పొల్యూషన్ కార్యక్రమంలో భాగంగా నగరంలో పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నియంత్రణకు జివిఎంసి అనేక అవగాహన పరమైన చర్యలు చేపడుతుందన్నారు. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కళాశాలల యాజమాన్యం, పరిశ్రమల యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలు, నగర ప్రజలు సహకరించి వారంలో ఒక్కరోజు ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడం వలన విశాఖ నగరంలో కాలుష్య నియంత్రణ పూర్తిగా నియంత్రించుటకు అందరూ సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.


Similar News