వరదనీటి నుంచి సోకిన వైరస్..బాలుడి కాలు తొలగింపు

వరద నీటి నుంచి సోకిన ఓ ప్రమాదకర వైరస్ ఓ బాలుడి కాలు తొలగించేందుకు కారణమైంది.

Update: 2024-09-26 06:19 GMT

దిశ, వెబ్ డెస్క్ : వరద నీటి నుంచి సోకిన ఓ ప్రమాదకర వైరస్ ఓ బాలుడి కాలు తొలగించేందుకు కారణమైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన 12ఏళ్ళ భవదీప్‌ కుటుంబం నివసించే ఇంట్లోకి ఈ నెల తొలి వారంలో వరద నీరు వచ్చింది. మరుసటి రోజు నీరు తగ్గే వరకు ఆ బాలుడు ఇంటి నుంచి బయటకు నీటిలోనే తిరుగాడాడు. ఇంట్లోని సామాన్లు తడవకుండా అమ్మానాన్నలకు సాయం చేశాడు. అదే రోజు రాత్రి అకస్మాత్తుగా అతడికి వణుకు, చలి, జ్వరం రావడంతో భవదీప్‌ను తల్లిదండ్రులు స్థానిక ఆర్‌ఎంపీ వద్ద చికిత్స చేయించారు. అయినా కోలుకోకపోవడంతో స్థానిక ఆసుపత్రిలో చేర్చగా డెంగ్యూ సోకినట్లుగా గుర్తించారు. ఇదే సమయంలో తొడల నుంచి అరికాళ్ల వరకు వాపులు రావడంతో విజయవాడలోని కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. కాళ్ల కండరాలను సూక్ష్మక్రిములు తినేశాయని వైద్యులు గుర్తించారు. వైరస్ శరీరమంతా విస్తరించకుండా ఈ నెల 17న శస్త్ర చికిత్స చేసి కుడి కాలును తొడ వరకు తొలగించారు. అయితే శరీరంలోకి సూక్ష్మ క్రిములు ఎలా ప్రవేశించాయి? అంత వేగంగా కాళ్ల కండరాలను ఎలా తినేశాయన్నదానిపై వైద్యులు కూడా కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. భవదీప్‌ పరిస్థితి పట్ల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు.

బాలుడికి చికిత్స అందిస్తోన్న అంకుర ఆసుపత్రి చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ వరుణ్, డాక్టర్‌ రవి మాట్లాడుతూ బాలుడి శరీరంలో కుళ్లిన భాగాల నుంచి తీసిన నమూనాలను పరీక్షలు చేయించడంతో శరీరంలోకి ఈ-కోలి, క్లెబిసెల్లా సూక్ష్మక్రిములు వెళ్లినట్లు తేలిందని చెప్పారు. ఈ క్రిముల్లోనూ ప్రమాదకర జాతులు ఉంటాయని, అవి శరీరంలోకి వెళ్లడం వల్లే, కాళ్లు బాగా వాచాయని తెలిపారు. వరద నీటిలో మురుగు నీరు కలుస్తుంటుందని, అప్పుడు బ్యాక్టీరియా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని, ఆ సమయంలో బ్యాక్టీరియా శరీరంలోకి చేరి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యాధిని అత్యంత అరుదుగా వచ్చే 'నెక్రోటైజింగ్‌ ఫాసియైటిస్‌ గా లేదా ఫ్లెష్‌ ఈటింగ్‌ డిసీజ్‌ గా పిలుస్తారని తెలిపారు. సాధారణంగా మధుమేహ రోగుల్లో ఎక్కువగా కనిపించే ఈ వ్యాధి చిన్నపిల్లల్లోనూ కనిపించడం ఆందోళన కలిగిస్తోందని.. శరీరంపై ఎటువంటి గాయాలు లేకుండానే భవదీప్‌ శరీరంలోకి ప్రమాదకరమైన బ్యాక్టీరియా ప్రవేశించడం విస్మయానికి గురిచేస్తోందన్నారు.

భవదీప్‌ శరీరంలోకి ప్రమాదకర బ్యాక్టీరియా చొచ్చుకుపోయి తినేయడం వల్ల కుడి కాలును తొడ భాగం వరకు తొలగించాల్సివచ్చిందన్నారు. ఎడమ మోకాలి కింద భాగంలో ముప్పై శాతం మేర కండను కూడా సూక్ష్మక్రిములు తినేశాయన్నారు. జ్వరంతో ఉన్న సమయంలో భవదీప్‌ను తల్లిదండ్రులు స్థానిక ఆర్‌ఎంపీకి చూపించారని తెలిపారు. అక్కడ యాంటీ బయాటిక్, స్టెరాయిడ్‌ ఇంజెక్షన్లను కండ (పిరుదు)కు ఇచ్చారని, ఇలా చేయకూడదని అన్నారు. కాళ్ల వాపులు గమనించిన వెంటనే అప్రమత్తం కావాలని సూచించారు. ప్రస్తుతం ఐసీయూలో భవదీప్‌ ఎడమ కాలి భాగం ఇప్పుడిప్పుడే నయమవుతోందని పూర్తిగా కోలుకునేందుకు రెండు, మూడు నెలల వరకు సమయం పడుతుందని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న భవదీప్‌కు అందించే వైద్యానికి అవసరమైన ఖర్చు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి స్థానిక ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య రూ.10 లక్షలు మంజూరు చేయించారు.


Similar News