బెజవాడ దుర్గమ్మకు వజ్రాల కిరీటం.. ఇంకా ఎన్నో కానుకలు

విజయవాడ కనకదుర్గమ్మవారికి అజ్ఞాత భక్తుడు రెండున్నర కోట్ల విలువైన బంగారం, వజ్రాలతో తయారు చేయించిన కిరీటాన్ని సమర్పించారు.

Update: 2024-10-03 05:06 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజున అమ్మవారు భక్తులకు శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. కొండ కిందనున్న వినాయకుడి ఆలయం వరకూ క్యూ లైన్ ఉండటంతో.. భక్తులకు త్వరగా దర్శనం కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

కాగా.. అమ్మవారికి ముంబైకి చెందిన సౌరభ్ గౌర్ అనే భక్తుడు బంగారం, వజ్రాలతో తయారు చేసిన కిరీటాన్ని అమ్మవారికి సమర్పించారు. సుమారు రూ.3 కోట్ల ఖర్చుతో ఈ వజ్రాల కిరీటాన్ని తయారు చేయించినట్లు ఆయన తెలిపారు. రేపటి నుంచి అమ్మవారు ఈ కిరీటాన్ని ధరించే భక్తులకు దర్శనమివ్వనున్నారు.

అలాగే కడపకు చెందిన సీఎం రాజేష్ అనే భక్తుడు అమ్మవారికి సూర్య, చంద్ర ఆభరణాలు అందజేశారు. పశ్చిమగోదావరి జిల్లా ఖండవల్లికి చెందిన సూర్యకుమారి అనే భక్తురాలు అమ్మవారికి వజ్రాలతో పొదిగిన ముక్కుపుడక, నత్తు, బులకీ, కర్ణాభరణాలను అందజేశారు. దసరా సందర్భంగా దుర్గమ్మతల్లికి తొలిరోజున నాలుగుకోట్ల రూపాయల విలువైన బంగారు, వజ్రాభరణాలు కానుకలుగా వచ్చినట్లు ఆలయ పాలకమండలి అధికారులు వెల్లడించారు. 



 



Similar News