గొడవలు పెట్టేందుకు రెండు కోతులు కలిశాయి: టీడీపీ-జనసేన పొత్తుపై మాజీమంత్రి వెల్లంపల్లి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ నుంచి అరాచక శక్తులు పెట్రేగిపోతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు.

Update: 2023-11-19 11:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం, జనసేన పార్టీలపై విరుచుకుపడే నాయకుల్లో మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముందు వరుసలో ఉంటారు. అటు చంద్రబాబు నాయుడును కానీ ఇటు పవన్ కల్యాణ్‌ను కానీ విమర్శించడంలో కాస్త దూకుడుగా వ్యవహరిస్తుంటారు. వారాహి విజయయాత్రను వరాహి విజయయాత్ర అనాలన్నా... చంద్రబాబు నాయుడు అనారోగ్య సమస్యలపై విమర్శలు చేయాలన్నా అది మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు తర్వాతే అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా తెలుగుదేశం, జనసేన పార్టీలపై మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శలు చేశారు. రెండు పార్టీలను కోతులతో పోల్చారు. వైసీపీ ప్రభుత్వంపై గొడవ చేయడానికి టీడీపీ, జనసేనలు కోతుల్లా తయారయ్యాయని విమర్శించారు. ఈ రెండు కోతులు కలిసి వైసీపీ ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నాయంటూ మండిపడ్డారు. పవన్ కల్యాణ్ ఆయన తోత్తులు కెబియన్ దగ్గర రోడ్డు మీద సెల్ఫీ తీసుకుని రోడ్లు ఎలా ఉన్నాయో చెప్పాలని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు సవాల్ విసిరారు. గతంలో ఇవ్వే రోడ్లు గోతులమయంగా ఉండేవని.. వైసీపీ ప్రభుత్వంలో విజయవాడలో వేసిన రోడ్లు చూడమని చెప్పాలంటూ వెల్లంపల్లి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.

పవన్, చంద్రబాబులు కలిస్తే సరిపోద్దా

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉండేవాని నాడు పవన్ కల్యాణ్ ఏం చేశారని.. ఎందుకు ప్రశ్నించలేదని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నిలదీశారు. చంద్రబాబు నాయుడు తన హయాంలో ఎన్నో తప్పులు చేశారని వాటన్నింటిని సీఎం జగన్ సరి చేసుకుంటూ వస్తున్నారని స్పష్టం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నరేళ్ల కాలంలో రెండేళ్లు కరోనాలో పోయిందని చెప్పుకొచ్చారు. ఆ సమయంలో పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్‌లో కూర్చుని షూటింగ్ చేసుకుంటూ ఉంటే... లోకేశ్ ఎక్కడ ఉన్నాడో తెలియదని ఎద్దేవా చేశారు. కానీ కార్యకర్తలను మాత్రం రోడ్ల మీదకు పంపించారని పవన్ కల్యాణ్, లోకేశ్‌లు మాత్రం ఏసీ గదుల్లో నుంచి బయటకు రాలేదని గుర్తు చేశారు. ఇకపోతే టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశాల్లో ఇరు పార్టీల కార్యకర్తలు ఎలా కొట్టుకుంటున్నారో అంతా చూస్తూనే ఉన్నారన్నారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు కలిస్తే సరిపోతుందా? కార్యకర్తల మనోభవాలు వీరికి అసవరం లేదా అని మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నిలదీశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సందర్భాల్లో మోసి మోసి మా భుజాలు అరిగిపోయాయని పవన్ కల్యాణ్ అన్నారని.. మరి ఈరోజు మళ్లీ ఎందుకు చంద్రబాబు నాయుడును మోస్తున్నారని ప్రశ్నించారు. అంటే ప్యాకేజీ తీసుకుని పవన్ కల్యాణ్ మరోసారి చంద్రబాబు నాయుడును అధికారంలోకి తీసుకువచ్చేందుకు పల్లకిలో మోస్తున్నారంటూ మాజీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.

Tags:    

Similar News