TTD: తిరుమలకు పూర్వవైభవం తేవాలి.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

రెండవరోజు తిరుమల పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Update: 2024-10-05 07:16 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రెండవరోజు తిరుమల పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. పద్మావతి అతిథి గృహంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి, టీటీడీ ఈవో, అదనపు ఈవో సహా ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సమీక్షలో చంద్రబాబు అధికారులకు కీలక సూచనలు చేశారు. తిరుమల పవిత్రత, నమ్మకం కాపాడేలా ఇక్కడ ప్రతిఒక్కరూ పనిచేయాలని, కొండపై గోవింద నామస్మరణ తప్ప మరో మాట వినిపించకూడదని స్పష్టం చేశారు. ప్రశాతంతకు ఎక్కడా భంగం కలగకూడదని, ఏ విషయంలోనూ రాజీ పడొద్దని, తిరుమలకు పూర్వ వైభవం తేవాలని సూచించారు. భవిష్యత్ నీటి అవసరాలకు తగ్గట్లు నీటి లభ్యత ఉండేలా చూసుకోవాలని, ముందస్తు ప్రణాళిక చాలా అవసరమని అధికారులకు సలహా ఇచ్చారు. అలాగే అటవీ ప్రాంతాన్ని 72 నుంచి 80 శాతంపైగా పెంచాలని, అటవీ సంరక్షణతో పాటు అడవుల విస్తరణ కోసం వచ్చే 5 ఏళ్లకు ప్రణాళికతో పనిచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

ప్రతి భక్తుడి నుంచి ఫీడ్ బ్యాక్..

అంతేగాక బయోడైవర్సీటీ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీటీడీ సేవలపై భక్తుల నుంచి స్పందన తీసుకునే విధానంపై అడిగి తెలుసుకున్న సీఎం.. వచ్చిన ప్రతి భక్తుడు తమ అనుభవాలపై అభిప్రాయాలు చెప్పే అవకాశం కల్పించాలని చెప్పారు. అలాగే భక్తుల సూచనలు, సలహాల ఆధారంగా సేవలపై టీటీడీ పనిచేయాలని, ఒక్క టీటీడీలోనే కాకుండా అన్ని దేవాలయాల్లో భక్తుల అభిప్రాయాలు తీసుకునే విధానం తీసుకురావాలని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి ముఖ్యమంత్రి సూచించారు. ఇక లడ్డూ ప్రసాదం, అన్న ప్రసాదం నాణ్యత పెరిగినట్లు భక్తులు చెపుతున్నారని, ఇది ఎల్లప్పుడూ, పూర్తిగా కొనసాగడమే కాకుండా.. మరింత మెరుగుపడాలని తెలిపారు. ప్రసాదాల తయారీలో వాడే పదార్థాల నాణ్యత బాగుండేలా చూడాలని, అత్యుత్తమ పదార్థాలు మాత్రమే వాడాలని చెప్పారు.

తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలి..

ఇక తిరుమలలో వీఐపీ సంస్కృతి తగ్గాలని, ప్రముఖులు వచ్చినప్పుడు హడావుడి కనిపించకుండా.. సింపుల్ గా ఉండాలని అన్నారు. అలాగే టీటీడీ సిబ్బంది భక్తుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని, దేశ విదేశాలనుంచి వచ్చేవారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పారు. అంతేగాక దురుసు ప్రవర్తన అనేది ఎక్కడా ఉండకూడదని, భక్తులు సంతృప్తితో, అనుభూతితో కొండ నుంచి తిరిగి వెళ్లాలని, తిరుమల పేరు తలిస్తే.. ఏడుకొండల వాడి వైభవం, ఆధ్యాత్మిక మాత్రమే చర్చకు రావాలని అన్నారు. స్విమ్స్ సేవలు కూడా మెరుగుపరచాలని, ఇదొక ప్రత్యేకమైన క్షేత్రం. తిరుమల పవిత్రత కాపాడడం, ఆధ్యాత్మిక విషయంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థల సహకారంతో శ్రీవారి సేవ (స్వచ్చంద సేవను)మరింత బలోపేతం చేయాలని, తద్వారా భక్తులకు సేవకుల ద్వారా చక్కటి సేవలు అందించాలని చంద్రబాబు అధికారులతో అన్నారు. 


Similar News