Ap News: రెండు రోజులు భారీ వర్షాలు.. కోస్తాకు తీవ్ర హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది..

Update: 2024-09-07 14:17 GMT

దిశ, వెబ్ డెస్క్: కోస్తాకు మరోసారి ప్రమాదం పొంచి ఉన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో రాష్ట్రం అతలాకుతలమైంది. వరదలతో ((Floods) ఉలిక్కిపడింది. ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో వాతావరణ శాఖ మరో బాంబ్ పేల్చింది.  బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరో రెండు రోజుల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దీంతో కోస్తా జిల్లాలో (Coastal District) భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. విజయనగరం, శ్రీకాకుళం, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం (Heavy Rains) పడుతుందని పేర్కొన్నారు.

ఇక ఉభయగోదావరి, అల్లూరి, ఎన్టీఆర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, పార్వతీపురం, కోనసీమ, కాకినాడ, కృష్ణా జిల్లాలకు భారీ వర్ష సూచనలు చేశారు. అంతేకాదు ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, పశువుల కాపరులు చెట్ల కిందకు వెళ్లొద్దని హెచ్చరించారు. వర్షాలు తగ్గే వరకూ మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని తెలిపారు.


Similar News