లోక్ సభ స్పీకర్ రేసు నుండి TDP ఔట్.. ఏపీ కోసం చంద్రబాబు సంచలన త్యాగం..!

కేంద్రంలో కొలువుదీరిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో లోక్ సభ స్పీకర్ పదవిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Update: 2024-06-23 12:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలో కొలువుదీరిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సంకీర్ణ ప్రభుత్వంలో లోక్ సభ స్పీకర్ పదవిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ (272 సీట్లు) బీజేపీకి సొంతంగా రాకపోవడంతో కూటమిలోని మిత్రపక్షాలు ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా మారాయి. ప్రధాని మోడీ నేతృత్వంలో ఏర్పాటైన కేబినెట్‌లో సైతం కీలకమైన హోం, రక్షణ, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రైల్వే, వ్యవసాయం వంటి శాఖలను బీజేపీ తమ వద్దే అట్టిపెట్టుకుంది. దీంతో ఎన్డీఏ సర్కార్ ఏర్పాటులో ముఖ్యపాత్ర పోషించిన టీడీపీ, జేడీయూ లోక్ సభ స్పీకర్ పదవిని ఆశిస్తున్నాయి. కీలకమైన శాఖలు కూడా ఇవ్వకపోవడంతో లోక్ సభ స్పీకర్ పోస్టును ఇవ్వాలని బీజేపీపై ఒత్తిడి తెస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

అయితే, సంకీర్ణ ప్రభుత్వంలో కీలకం కానున్న లోక్ సభ స్పీకర్ పదవిని సైతం బీజేపీ తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తోంది. టీడీపీ, జేడీయూ స్పీకర్ పదవి కోసం పోటీ పడకుండా రేసు నుండి తప్పించేందుకు బీజేపీ కొత్త స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. టీడీపీ, జేడీయూలకు వేరే పదవులు ఆఫర్ చేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో లోక్ సభ స్పీకర్ పదవిపై టీడీపీ చీఫ్ చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో టీడీపీ ఎంపీలతో శనివారం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వైఖరిపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలోనే లోక్ స్పీకర్ పదవిపై బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నాకు ఫోన్ చేసి లోక్ సభ పదవి గురించి అడిగారు. లోక్ సభ స్పీకర్ పదవి టీడీపీకి వద్దని అమిత్ షాకు తేల్చిచెప్పినట్లు ఎంపీలకు చంద్రబాబు వివరించారు.

కేంద్రంలో మనం పదవులు కోసం పోటీ పడితే.. రాష్ట్ర ప్రయోజనాల దెబ్బతింటాయని.. దీనిని దృష్టిలో పెట్టుకునే స్పీకర్ పోస్ట్ వద్దని చెప్పానని అన్నారు. మనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ఎంపీలకు స్పష్టం చేశారు. అమిత్ షా స్పీకర్ పదవి గురించి ఫోన్ చేసినప్పుడు కూడా.. రాష్ట్రానికి నిధులు మాత్రమే కావాలని.. రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతింది.. ఆదుకోవాలని కోరానని అన్నారు. చంద్రబాబు తాజా వ్యాఖ్యలతో లోక్ సభ స్పీకర్ పదవి రేస్ నుండి టీడీపీ వెదొలిగినట్లేనని స్పష్టం అవుతోంది. లోక్ సభ స్పీకర్ పదవిపై కన్నేసిన బీజేపీ.. జేడీయూను కూడా రేస్ నుండి తప్పించేందుకు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను రంగంలోకి దించింది. ఈ నెల 24వ తేదీ నుండి ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. మోడీ 3.0 ప్రభుత్వంలో లోక్ సభ స్పీకర్ పదవి ఎవరినీ వరిస్తోందో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.


Similar News