ఆయనెందుకు.. నేను వస్తా.. నువ్వు రా..? అంటూ మంత్రి కాకాణి సవాల్‌ను స్వీకరించిన గోరంట్ల

రైతు సంక్షేమంపై మంత్రి కాకాణి సవాల్ ను టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్వీకరించారు....

Update: 2023-12-11 10:46 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ఇప్పుడు రైతు సంక్షేమం హాట్ టాపిక్ అయింది. ఎంతగా అంటే అధికార , ప్రతిపక్షం సవాళ్లు విసురుకునేలా. అంతేకాదు రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి కూడా కారణమైంది. 2014లో టీడీపీ, 2019లో వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయి. అప్పుడు, ఇప్పుడు తుఫానులు వచ్చాయి. పంట నష్టం కలిగించాయి. అయితే అప్పుడు తుఫాను వచ్చి జరిగిన నష్టంపై రైతులకు చంద్రబాబు పరిహారం అందించారు. తాజాగా తుఫాను నష్టంపై సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా రైతులకు సాయం చేశారు. అయితే తుఫాను పరిహారంపై అప్పుడు వైసీపీ నేతలు విమర్శలు చేస్తే ఇప్పుడు తెలుగుదేశం నాయకులు సేమ్ అదే రిపీట్ చేశారు.

అయితే ఇప్పుడు ఈ విమర్శలు కాస్త సవాళ్లు వరకు వెళ్లాయి. ఎంతగా అంటే 2014-2019లో చంద్రబాబు ఏం చేశారు?.. 2019 నుంచి 2023 వరకు జగన్ ఏం చేశారనేదానిపై చర్చ పెట్టాలన్నంత వరకు వెళ్లాయి. రైతులకు తుఫాను నష్టం, పరిహారం అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందని, రైతులను సీఎం జగన్ పరామర్శించిన తీరు సరిగాలేదని చంద్రబాబు విమర్శలు చేశారు. అందుకు కౌంటర్‌గా టీడీపీ హయాంలో చంద్రబాబు మాత్రం ఇంతకంటే ఎక్కువ పరిహారం అందించారా?, మరింత అండగా నిలిచారా? అని వైసీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాదు అసలు అప్పుడు.. ఇప్పుడు ఏం జరిగిందో తెలియాలంటే చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు. 

మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అయితే ప్రెస్ మీట్ పెట్టి మరీ చంద్రబాబుకు సవాల్ విసిరారు. చంద్రబాబు కేవలం ఫోటోలకు ఫోజులు ఇచ్చే ముఖ్యమంత్రి మాత్రమేనని ఎద్దేవా చేశారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నేడు రైతులను ఉద్దరించే నాయకుడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతుల సంక్షేమం కోసం టీడీపీ హయాంలో ఏం జరిగింది.. వైసీపీ పాలనలో ఏం జరిగింది అనేదానిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. దమ్ముంటే చర్చకు రావాలన్నారు

అయితే కాకాణి సవాళ్లను టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్వీకరించారు. చంద్రబాబుకు సవాల్ విసిరే స్థాయి కాకాణి లేదని.. రైతాంగం, వ్యవహానికి జగన్ ప్రభుత్వం ఏం చేసిందో దమ్ము, ధైర్యం ఉంటే విజయవాడలో ప్రజల సమక్షంలో నిరూపిద్దామ అంటూ మంత్రి కాకాణికి గోరంట్ల సవాల్ విసిరారు. మించౌగ్ తుఫాను నష్ట పరిహారంగా ప్రభుత్వం తక్షణమే రైతులకు రూ. 10 వేల కోట్లు ఆర్థిక సాయం అందించాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. వ్యవసాయి, సాగు నీటి రంగాలకు జగన్ ప్రభుత్వం ఒరగబెట్టిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇలా వైసీపీ, టీడీపీ నాయకులు తుపాను నష్టంపై పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. కానీ చోట్ల ప్రభుత్వం అందిస్తున్న పరిహారం చాలడం లేదని రైతులు అంటున్నారు. ఇటువంటి సమయంలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చేసిన సవాల్‌కు మంత్రి కాకాణి నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News