ప్రజలు తొక్కిపట్టి నారతీస్తారు.. సీఎం జగన్‌కు యనమల వార్నింగ్

ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కితే ప్రజలే తొక్కిపట్టి నారతీస్తారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. జీవో నెం .1 రద్దు జగన్ రెడ్డి మూర్ఖత్వానికి చెంపపెట్టని ఆయన విమర్శించారు...

Update: 2023-05-12 15:24 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కితే ప్రజలే తొక్కిపట్టి నారతీస్తారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. జీవో నెం .1 రద్దు జగన్ రెడ్డి మూర్ఖత్వానికి చెంపపెట్టని ఆయన విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అడుగులు వేస్తే .. న్యాయస్థానాలు , రాజ్యాంగం చూస్తూ ఊరుకోవనే విషయం నేటి హైకోర్టు తీర్పుతో జగన్ రెడ్డి తెలుసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు అన్నారు. ప్రజాస్వామ్య హక్కుల్ని హరించేలా జగన్ రెడ్డి తెచ్చిన నల్ల జీవో నెం .1ని హైకోర్టు కొట్టివేయడం ప్రజాస్వామ్య విజయంగా అభివర్ణించారు.

ప్రజలు, ప్రతిపక్షాలు, ప్రతిపక్ష నాయకులు రోడ్డెక్కకూడదని ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించకూడదనే నిరంకుశ పోకడతో జీవో తెచ్చి .. నేడు కోర్టు మొట్టికాయతో భంగపడ్డారని యనమల ధ్వజమెత్తారు. ఇప్పటికే జగన్ రెడ్డి తెచ్చిన జీవోలు, తీసుకున్న నిర్ణయాలను కోర్టులు ఎప్పటికప్పుడు కొట్టేస్తున్నా..ఇంకా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని యనమల మండిపడ్డారు. జీవో నంబర్ వన్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ రెడ్డి క్రూరత్వాన్ని చాటిచెబుతున్నాయని విరుచుకుపడ్డారు. జగన్ రెడ్డికి సిగ్గు, శరం ఏమైనా ఉంటే ఇప్పటికైనా ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకోవాలని సూచించారు. రాజ్యాంగ హక్కుల్ని , ప్రజాస్వామ్య స్ఫూర్తిని అణగదొక్కుతా అనేలా వ్యవహరిస్తే ప్రజలు తొక్కిపట్టి నారతీస్తారు అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు హెచ్చరించారు.

Tags:    

Similar News