గన్నవరం ఘటన బాధ్యులను శిక్షించండి.. చంద్రబాబు నాయుడు

గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు.

Update: 2023-02-21 10:00 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: గన్నవరం నియోజకవర్గం టీడీపీ కార్యాలయంపై దాడులు, హింసాత్మక ఘటనలకు పాల్పడిన వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు పట్టాభిరామ్, దొంతు చిన్నాలను వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసి వేధిస్తోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలకు భద్రత కల్పించాలని కోరారు. గన్నవరంలో దాడులు, హింసాత్మక ఘటనలపై డీజీపీకి చంద్రబాబు లేఖ రాశారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరుగుతుంటే పోలీసులు మౌనంగా చూస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. అంటే వైసీపీ గూండాలకు పోలీసులు పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లుగా ఉందని అనుమానం వ్యక్తం చేశారు.

గన్నవరం పార్టీ కార్యాలయ సామగ్రి ధ్వంసం చేసి కార్లకు నిప్పు పెట్టారని, దొంతు చిన్నాకు చెందిన వాహనాలను తగలబెట్టారని చంద్రబాబు లేఖలో ఆరపించారు. మరోవైపు పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ పోలీసుల అదుపులో ఉన్నారా లేదా అనేది తెలియజేయాలి అని డిమాండ్ చేశారు. పట్టాభిని పోలీసులు అరెస్టు చేశారా.. ఎవరైనా కిడ్నాప్ చేశారా? అనే దానిపై పోలీసులు సమాధానం ఇవ్వాలని కోరారు. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలో విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News