టార్గెట్ 100డేస్: టీడీపీ-జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి సమన్వయ కమిటీ రెండోసమావేశం ప్రారంభమైంది.

Update: 2023-11-09 06:49 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా టీడీపీ-జనసేన పార్టీల ఉమ్మడి సమన్వయ కమిటీ రెండోసమావేశం ప్రారంభమైంది. రాష్ట్రస్థాయిలో జరిగే ఈ రెండో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్‌కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. అయితే టీడీపీ తరఫున పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరయ్యారు. నారా లోకేశ్‌తోపాటు ఆరుగురు కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, తంగిరాల సౌమ్య, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, పయ్యావుల కేశవ్‌లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మరోవైపు జనసేన నుంచి పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పార్టీ ఉపాధ్యక్షుడు బి.మహేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికమిటీ సభ్యులు పాలవలస యశస్వి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్, రాష్ట్రమత్స్యకార వికాస విభాగం చైర్మన్ బొమ్మిడి నాయకర్, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావులు హాజరయ్యారు. అటు జనసేన ఇటు టీడీపీ తరఫున మెుత్తం 13 మంది సభ్యులు పాల్గొన్నారు. ఇకపోతే అక్టోబర్ 23న రాజమహేంద్రవరంలోని మంజీర హోటల్‌లో టీడీపీ-జనసేన పార్టీ తొలి సమన్వయ కమిటీ భేటీ జరిగింది. తాజాగా గురువారం రెండో భేటీ టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రోగ్రాం రూపకల్పన పై చర్చ జరగనుంది. అలాగే ఈ సమావేశం వేదికగా రెండు పార్టీలు కలిసి ప్రజల్లోకి వెళ్లడంపై చర్చించనున్నారు. ప్రజా సమస్యల వారీగా ఉద్యమ కార్యాచరణ చేపట్టే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రతి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్ లేకుండానే


ఇకపోతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరుగుతున్న ఈ సమన్వయ కమిటీ సమావేశానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరుకాలేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన పార్టీ తెలంగాణలోనూ పోటీ చేయనుంది. పొత్తులో భాగంగా జనసేన పార్టీ ఎనిమిది స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ మేరకు జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించిన పవన్ కల్యాణ్ అనంతరం అందరికీ బీఫామ్‌లను అందజేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం, ఇతర విషయాలతో పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడపనున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ ఈ సమావేశానికి హాజరుకాలేదని తెలుస్తోంది. 

Tags:    

Similar News