AP News: ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. స్టే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆరు నెలల కాలవ్యవధి లోపల రాజధాని నిర్మాణం పూర్తి చేయాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది...

Update: 2022-11-28 09:37 GMT

అమరావతి విషయంలో హైకోర్టు తన పరిధిని అతిక్రమించింది

కాలపరిమితిలో నిర్మాణాలు పూర్తి చేయమని ఆదేశాలివ్వడం ఏంటి?

మీరే ప్రభుత్వమైతే, అక్కడ క్యాబినెట్ ఎందుకు?

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆరు నెలల కాలవ్యవధి లోపల రాజధాని నిర్మాణం పూర్తి చేయాలన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. అంతేకాదు కాలపరిమితిలోగా నిర్మాణాలను పూర్తి చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులపై ధర్మాసనం స్టే విధించింది. అనంతరం ప్రతివాదులకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. సోమవారం కూడా ఈ కేసు విచారణ జరిగింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నం ఈ కేసు విచారణ చేపట్టారు. ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది కేకే వేణుగోపాల్ వాదనలు వినిపించారు. 'ఒక నెలలో రాజధాని పనులు పూర్తి చేయాలని హైకోర్టు చెబుతోంది. రాజధానిపై నిరంతరంగా హైకోర్టు ఆదేశాలిస్తోంది. రాజధాని అనేది స్థిరమైనది కాదు. అసాధ్యమైన పనులన్నీ చేయమని చెపుతోంది' అని కోర్టు దృష్టికి న్యాయవాది కేకే వేణుగోపాల్ తీసుకెళ్లారు. 'సమయానుకూలంగా రాజధానిని మార్చుకునే అధికారం లేదా అని ప్రశ్నించారు. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. మూడు రాజధానుల చట్టాన్ని రద్దు చేశారు. రేపు శాసన వ్యవస్థ ఏం చేస్తుందో చెప్పలేము. రైతుల కాంట్రాక్ట్​ప్రయోజనాలను కాపాడుతాం. మేము మరింత యాన్యుటి పెంచాం' అని న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలియజేశారు.

వాదనలు విన్న ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. 'హైకోర్టు ఏమైనా టౌన్​ ప్లానరా?, ఇలాంటి అంశాలలో నైపుణ్యం లేకుండా ఇలాంటి ఆదేశిలిస్తారా?, రెండు నెలలలో నిర్మాణం చేయమంటారా?, డ్రా చేయమంటరా.?' అని ప్రశ్నించింది. కోర్టులు ఎప్పటికీ ప్రభుత్వాలు కాదు. అలాంటి ఆదేశాలు ఇవ్వొచ్చా?. మీరే ప్రభుత్వమైతే, అక్కడ క్యాబినెట్ ఎందుకు? అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ప్రభుత్వంలాగా వ్యవహరిస్తోందా? అని న్యాయమూర్తి జస్టిస్​నాగరత్న ప్రశ్నించారు. అంతా ఒకే చోట కేంద్రీకరించడం ఎలా సాధ్యం అని అడిగారు. ఏ నగరాలను అభివృద్ధి ఎలా చేయాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కదా అని ప్రశ్నించారు. హైకోర్టు ఈ అంశంలో తన పరిధిని అతిక్రమించింది.' అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రతివాదులకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ జనవరి 31కి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి 

AP News:సర్కార్‌కు ఊరట.. హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఆగ్రహం 

Tags:    

Similar News