చంద్రబాబు హయాంలో స్కాములే..స్కీంలు ఎక్కడ?: సీఎం జగన్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఎం వైఎస్ జగన్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు.

Update: 2023-11-07 10:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఎం వైఎస్ జగన్ మరోసారి విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు తన హయాంలో ఏది ముట్టుకున్నా స్కాంలేనని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు పాలనలో స్కీంల గురించి కాకుండా స్కాంల గురించే ఆలోచించేవారని విమర్శించారు. చంద్రబాబు హయాంలో ఎప్పుడూ కరువేనని, రైతు రుణ మాఫీ మాట తప్పారని సీఎం జగన్ ధ్వజమెత్తారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపరిస్థి సభలో వైఎస్ఆర్ రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు రైతులకు చేసిందేమీ లేదని అన్నారు. కనీసం రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఆలోచన కూడా చేయలేని వ్యక్తి అని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్బీకేల ద్వారా రూ.60 వేల కోట్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు. ఏ పంట సీజన్‌లో నష్టం జరిగితే అదే సీజన్‌లో ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. సున్నావడ్డీ రుణాలు, పంటల బీమాతో అన్నదాతకు భరోసా కల్పిస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. నాలుగేళ్లలో ఇప్పటివరకూ రూ.33,209 కోట్ల సాయాన్నిఅన్నదాతలకు అందజేసినట్లు సీఎం వైఎస్ జగన్ వివరించారు. వైసీపీ పాలన గురించి చర్చించుకుంటే అనేక పథకాలు గుర్తుకు వస్తాయని అన్నారు. అదే చంద్రబాబు పాలన గురించి చర్చించుకుంటే స్కాంలు తప్ప స్కీములు గుర్తుకు రావని ఎద్దేవా చేశారు. ఏపీ స్కిల్ డవలప్‌మెంట్ స్కాం, ఏపీ ఫైబర్ గ్రిడ్ స్కాం, మద్యం, ఇసుక దందా ఇలా అన్నింటిలోనూ చంద్రబాబు రాష్ట్ర సంపదను దోచుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు దోచుకోవడం, దాచుకోవడమే తెలుసునని సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. 

Tags:    

Similar News