Palnadu: మరోసారి చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

పల్నాడు జిల్లా నడికుడి రైలు మార్గంలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు...

Update: 2024-09-06 08:16 GMT

దిశ, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా నడికుడి రైలు మార్గంలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. రాత్రి సమయంలో రైళ్లలో వరుస చోరీలకు పాల్పడుతున్నారు. ప్రయాణికులను బెదిరించి నగలు, నగదు దోచుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు దోపిడీలు జరిగాయి. ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు తీసుకున్నా రికవరీలో రైల్వే పోలీసులు వెనుకబడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత అర్థరాత్రి సైతం మరో ఘటన కలకలం రేపింది.

నడికుడి సమీపంలో చెన్నై ఎక్స్‌పెస్ రైలులో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఒక్కసారిగా రైలులోకి చొరబడిన దొంగలు కత్తులు, చాకులు చూపించి ప్రయాణికుల నుంచి డబ్బులు, బంగారం గుంజుకున్నారు. ప్రశ్నించిన ప్రయాణికులపై చంపేస్తామని బెదిరించారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు. అయితే 15 రోజుల క్రితం కూడా ఇదే రూట్‌లో నారాయణపూర్ ఎక్స్‌ప్రెస్‌లో చోరీ జరిగింది. ఈ నెలలో ఇది మూడో దోపిడీ కావడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు-సికింద్రాబాద్ రూట్‌లో రాత్రిసమయంలో ప్రయాణం చేయాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ఇప్పటికైనా రైల్వే పోలీసులు చర్యలు రైళ్లలో నిఘా పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.


Similar News