RK Roja: వైసీసీని వీడబోతున్నట్లుగా ప్రచారం.. అందరికీ షాకిస్తూ ఇన్‌‌స్టాలో రోజా మెసేజ్

రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.

Update: 2024-08-28 04:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. కేవలం 11 సీట్లకే పరిమితమై అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. దీంతో ఆ పార్టీకి పలువురు మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. మరికొందరు శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా సైతం కొన్నాళ్ల నుంచి సైలెంట్‌గా ఉంటూ వస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న నాడు ప్రతిరోజూ ఆమె టీడీపీ, జనసేనలకు టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పించే వారు.

ముఖ్యంగా సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ.. నిత్యం వార్తల్లో ఉండేది. అనంతరం రాష్ట్రంలో కూటమి అఖండ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో కొన్నాళ్ల నుంచి ఆర్కే రోజా జాడ లేదు. అదేవిధంగా తాజాగా తన సోషల్ మీడియా ఖాతా నుంచి పార్టీ పేరును తొలగించారు. నిన్న, మొన్నటి వరకూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో వైసీపీ నగరి ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మంత్రిగా పేరు ఉండేది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను ఆమె పూర్తిగా మార్చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరును తొలగించి నగరి ఎక్స్ ఎమ్మెల్యే, ఎక్స్ మంత్రిగా మార్పు చేశారు. అంతేకాదు పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను అన్‌ఫాలో చేశారు. జగన్‌తో ఉన్న ఫొటోను కూడా తొలగించారు.

దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రోజా గుడ్ బై చెప్పబోతున్నారా అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. ఈ పరిణామంతో అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సైతం షాక్‌కు గురయ్యారు. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రోజా చేసిన మెసేజ్ అందరి అనుమానాలను పటాపంచలు చేసింది. ఇవాళ సీఎం వైఎస్ జగన్, భారతిల పెళ్లి రోజు సందర్భంగా రోజా వారిద్దరికి విషెస్ చెప్పారు. ‘ఏళ్లన్నీ గడచినా చెదరని మీ అనుబంధం.. ఇలాగే కలకాలం సాగాలని ఆశిస్తూ...! అన్నా వదినకి హృదయపూర్వక పెళ్లిరోజు శుభాకాంక్షలు’ అంటూ వారిద్దరి ఫొటోను జత చేసి కామెంట్ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


Similar News