నా జోలికొచ్చి వైఎస్ఆర్ ఏమయ్యాడో గుర్తు చేసుకో చంద్రబాబు.. కేఏ పాల్ వార్నింగ్
నా జోలికి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏమయ్యాడో సీఎం చంద్రబాబు గుర్తు చేసుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: నా జోలికి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajashekar Reddy) ఏమయ్యాడో సీఎం చంద్రబాబు (CM Chandrababu) గుర్తు చేసుకోవాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (Prajashanthi Party President KA Paul) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కూటమి ప్రభుత్వం (Coalition Governamnet)పై ఫైర్ అయ్యాడు. ఈ సందర్భంగా ఆయన.. చంద్రబాబు ఒక్కసారి నన్ను కలవండి.. లేకపోతే ఒక్క సంవత్సరంలో ఏం అవుతుందో మీరే చూస్తారని హెచ్చరించారు. నా చారిటీ జోలికి వచ్చిన వారికి, హిందు ముస్లిం, క్రిస్టియన్ల మధ్య గొడవలు పెట్టిన వారికి ఏం జరిగిందో మీరు చూశారని, చంద్రబాబుకు కూడా అదే జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు ఏడుగురు బోర్డు మెంబర్లు కుక్క చావు చచ్చారని, ఇప్పుడు మీరు కొత్త బోర్డు మెంబర్లను పెట్టి నాటకాలు ఆడుతున్నారా అని మండిపడ్డారు. తాను దేవుడి దూతను అని, దేవుడితో పట్టుకోవద్దని, చంద్రబాబు ఒక్కసారి కలవాలి అని చెప్పారు. అంతేగాక జగన్ (YS Jagan) అధికారంలో ఉన్నప్పుడు తనను కలవలేదని, ఇప్పటికైనా తనను ఒక్కసారి కలిస్తే రెడ్ బుక్ (Red Book) ను ఏడు రోజుల్లో క్లోజ్ చేస్తానని, ప్రెయర్ బుక్ ను ఓపెన్ చేస్తానని తెలిపారు. మరోక్క వైసీపీ నాయకుడిని కూడా అరెస్ట్ కాకుండా చేస్తానని, లేదంటే ఆ రెడ్ బుక్ లో ఉన్న వాళ్లందరూ పోతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన తండ్రి, తాత తనను ఎందుకు కలిసేవారో జగన్ జైలుకు పోయాక అయినా.. గుర్తు చేసుకొని తప్పు తెలుసుకోవాలని అన్నారు.
అలాగే భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధాని మోడీ సహా తెలుగు రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులు తనకు ఎంత గౌరవం ఇస్తారో అందరికీ తెలుసని అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), నారా లోకేష్ (Nara Lokesh) తన చారిటీల జోలికి వస్తే వైఎస్ఆర్ కు ఏం జరిగిందో గుర్తు చేసుకోవాలని అన్నారు. వైఎస్ఆర్ ఏడుగురు క్రిస్టియన్ బోర్డు మెంబర్లతో కలిసి తన ఆస్తులను అక్రమంగా దోచేయాలని చూశారని, వారందరూ ఏమయ్యారో చూశారుగా అని చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు నాతో కలిసి పని చేయాలని ఉంటే.. రండి కలిసి పని చేద్దాం అని పాల్ ఆఫర్ ఇచ్చారు. ఇక తాను అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ (USA President Trump), ప్రధాని మోడీ (PM Modi) సహా ఈ దేశంలోని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి భయపడనని, ప్రపంచమే నన్ను చూసి భయపడుతుందని కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.