బ్రేకింగ్ న్యూస్.. రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా
బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత, ఆర్ కృష్ణయ్య(R Krishnaiah) ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా వైసీపీ పార్టీ తరుఫున ఎన్నికయ్యారు.
దిశ, వెబ్డెస్క్: బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత, ఆర్ కృష్ణయ్య(R Krishnaiah) ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎంపీగా వైసీపీ పార్టీ తరుఫున 2022లో ఎన్నికయ్యారు. కాగా ఎవరూ ఊహించని విధంగా తన రాజ్యసభ ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రాన్ని రాజ్యసభ చైర్మన్కు పంపారు. ఆయన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. దీంతో ఏపీ నుంచి ఒక రాజ్యసభ స్థానం ఖాళీ అయినట్లు బులిటెన్ విడుదల చేశారు.
ఇదిలా ఉంటే తెలంగాణలో బీసీ నేతగా ఉన్న ఆర్. కృష్ణయ్యకు వైసీపీ రాజ్యసభ ఎంపీగా అవకాశం ఇవ్వడం అప్పట్లో అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇటీవల ఆయన బీజేపీలో చేరనున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఏపీలో బీజేపీ కూటమి వ్యతిరేక పార్టీ రాజ్యసభ ఎంపీగా ఉన్న ఆయన ప్రస్తుతం రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది.
కాగా ఆర్. కృష్ణయ్య బీసీల హక్కుల కోసం పోరాడుతున్నారు. 2014లో ఎల్బీనగర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ సమయంలో టీడీపీ ఆయనను తమ పార్టీ సీఎం అభ్యర్థిగా కూడా ప్రకటించింది. అనంతరం.. 2022లో వైసీపీ ఆయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చింది. దీంతో ఆయన రెండేళ్లుగా వైసీపీ ఎంపీగా (రాజ్యసభ) కొనసాగుతున్న ఆయన ఈ రోజు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి అందరికి షాక్ ఇచ్చారు.