పురంధేశ్వరి ఓ చంద్రముఖి..మద్యం టేస్ట్ చేస్తుందేమో? : మంత్రి సీదిరి అప్పలరాజు

ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిని వైసీపీ టార్గెట్ చేసింది.

Update: 2023-11-10 12:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరిని వైసీపీ టార్గెట్ చేసింది. మద్యం, ఇసుక కుంభకోణాలపై పురంధేశ్వరి ప్రశ్నిస్తూ వైసీపీని హడలెత్తిస్తున్నారు. మరోవైపు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీజేఐకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి విజయసాయిరెడ్డి దగ్గర నుంచి మంత్రులు ఆర్‌కే రోజా, గుడివాడ అమర్‌నాథ్, జోగి రమేశ్, అంబటి రాంబాబులు టార్గెట్ చేశారు. పురంధేశ్వరికి మైకుల ముందే కాదు ఏకంగా ట్విటర్ వేదికగా తీవ్ర విమర్శలు చేస్తునారు. పురంధేశ్వరిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం దుమారం రేపుతుంది. దీంతో ఏపీ రాజకీయాలు ప్రస్తుతం బీజేపీ వర్సెస్ వైసీపీగా మారిపోయాయి. తాజాగా దగ్గుబాటి పురంధేశ్వరిపై మంత్రి సీదిరి అప్పలరాజు రెచ్చిపోయారు. ఏపీలో మద్యం బ్రాండ్లను పురంధేశ్వరి టేస్ట్ చేస్తున్నారమేనంటూ అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న బూమ్ బూమ్ .. గవర్నర్ చాయిస్ ఇవన్నీ చంద్రబాబు పర్మిషన్‌తో వచ్చినవేనని చెప్పుకొచ్చారు. పురంధేశ్వరి వెళ్ళి చంద్రబాబునే మద్యం బ్రాండ్లపై ప్రశ్నించాలి అని సూచించారు. దగ్గుబాటి పురంధేశ్వరి టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును పట్టుకుని రాజకీయాలు చేయకూడదు అని హితవు పలికారు. బీజేపీలోకి వచ్చి, చంద్రబాబుకు వంత పాడటం మొదలెట్టాక ఆమె పరువు దిగజారిపోయిందన్నారు. బీజేపీలో ఉన్న క్యాడరే పురంధేశ్వరితో విభేదిస్తున్నారని చెప్పుకొచ్చారు. పురంధేశ్వరికి టీడీపీపై మమకారం ఉంటే.. ఆమె ఆ పార్టీలో వెళ్లి చేరవచ్చు అని సూచించారు. పురంధేశ్వరి మాటలు చూస్తే.. ఆమె పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిందనిపిస్తుందని మంత్రి సీదిరి అప్పలరాజు సెటైర్లు వేశారు.

Tags:    

Similar News