వరద ప్రాంతాల్లో రేపటి నుంచి నిత్యావసర సరుకులు: మంత్రి నాదెండ్ల మనోహర్

విజయవాడలో వరద ముంపునకు గురైన బాధితులందరికీ పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖల ద్వారా శుక్రవారం ఉదయం వివిధ నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

Update: 2024-09-05 10:38 GMT

దిశ ప్రతినిధి,విజయవాడ:విజయవాడలో వరద ముంపునకు గురైన బాధితులందరికీ పౌర సరఫరాలు, మార్కెటింగ్ శాఖల ద్వారా శుక్రవారం ఉదయం వివిధ నిత్యావసర సరుకుల పంపిణీ ప్రారంభించడం జరుగుతుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మాత్యులు నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గురువారం విజయవాడ కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఎన్నో వరదలను చూశామని కానీ ఈసారి వరదలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. అయితే బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అధికార యంత్రాంగం అహర్నిశలు పని చేసి సహాయ చర్యలు కొనసాగించడం జరుగుతుందని మంత్రి మనోహర్ పేర్కొన్నారు.

శుక్రవారం ఉదయం 10 గంటల నుండి విజయవాడలోని 179 వార్డు, 3 గ్రామ సచివాలయం పరిధిలో వరద బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు వంట నూనె, కిలో పంచదార, 2 కిలోల ఉల్లిపాయలు, 2 కిలోల బంగాళా దుంపలు రెండు బ్యాగులుగా చేసి పంపిణీ చేయడం జరుగుతుందని మంత్రి మనోహర్ వెల్లడించారు. ముందుగా ఎక్కువ ముంపునకు గురైన ప్రాంతాల్లో పంపిణీని చేపట్టి మిగతా ప్రభావిత ప్రాంతాల్లో పంపిణీ జరుగుతుందని తెలిపారు. ఇపోస్ మిషన్లో లబ్ధిదారుల వివరాలు నమోదు చేసి పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. ఒక్క రోజులోనే నిత్యావసర సరుకుల పంపిణీని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు.

ఇప్పటికే సుమారు 2 లక్షల మంది బాధితులను గుర్తించడం జరిగిందని మంత్రి మనోహర్ వెల్లడించారు. వరద ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతుందని చెప్పారు. రేషన్ కార్డులు లేని వారికి ఆధార్ కార్డు నమోదు ద్వారా పంపిణీ చేస్తామని అన్నారు. శుక్రవారం విజయవాడలో 12 ప్రాంతాల్లో గ్యాస్ సర్వీస్ కేంద్రాలు ఏర్పాటు, వరదలకు దెబ్బతిన్న బాధితులకు గ్యాస్ స్టవ్ మరమ్మత్తుకు సంబంధించిన ఉచిత సేవలు అందించేందుకు బిపిసిఎల్,హెచ్పిసిఎల్, ఐఓసి కంపెనీల ఆధ్వర్యంలో 12 ప్రాంతాల్లో ఉచిత సర్వీస్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చాయని మంత్రి మనోహర్ చెప్పారు.

Tags:    

Similar News