నా జన్మ చరితార్థం అయ్యింది: కడపలో సీఎం వైఎస్ జగన్

మత సామరస్యానికి ప్రతీకగా, మహిమాన్విత సూఫీగా వెలుగొందుతున్న.. అమీన్ పీర్ దర్గాను సందర్శించడంతో తన జన్మ చరితార్థం అయ్యింది.

Update: 2023-11-30 12:47 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ‘మత సామరస్యానికి ప్రతీకగా, మహిమాన్విత సూఫీగా వెలుగొందుతున్న.. అమీన్ పీర్ దర్గాను సందర్శించడంతో తన జన్మ చరితార్థం అయ్యింది. ఇది అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను’ అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం సీఎం వైఎస్ జగన్ కడప అమీన్ పీర్ (పెద్ద దర్గా) దర్గాను సందర్శించి ప్రభుత్వ లాంఛనాలతో పూల చద్దార్ సమర్పించారు. ఇకపోతే అమీన్ పీర్ దర్గా ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ దర్గా ప్రతినిధులు దర్గా సంప్రదాయ లాంఛనాలతో ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా పెద్ద దర్గా ప్రధాన మందిరంలోకి ముఖ్యమంత్రిని సాదరంగా పీఠాధిపతి హరిఫుల్లా హుస్సేని,దర్గా కమిటీ సభ్యులు ఆహ్వానించారు. అనంతరం దర్గా సేవలో నిరంతరం పునీతులవుతున్న దర్గా ముజావర్లు,దర్గా కమిటీ సభ్యులను,చౌదరీ కలీఫాలను.. దర్గా పీఠాధిపతులు హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ముఖ్యమంత్రికి పరిచయం చేశారు. అనంతరం దర్గా పీఠాధిపతుల వారిచే "సూఫీ సర్మాస్త్ సానీ షిలాక్" సంప్రదాయం ప్రకారం ముఖ్యమంత్రికి తలపాగా (పేటా) అలంకరణ చేసి, మెడలో షేలా (కండువా), ఇలాచి (దండ)ధరింప చేశారు. తర్వాత పీఠాధిపతులతో కలిసి ముఖ్యమంత్రి అమీన్ పీర్ దర్గా గుమ్మం ముందుకు చేరుకుని.. అక్కడి నారికేళీ రాతిపై కొబ్బరికాయ కొట్టి స్వామివారికి సమర్పించుకున్నారు. అనంతరం ముజావర్లు పూలు, వస్త్ర చాదర్, సుగంధ పరిమళాల అత్తరుతో కూడిన తట్టను ముఖ్యమంత్రికి అందజేయగా.. ఆయన తలపై పెట్టుకుని భక్తి పరవశ్యమైన మనస్సుతో ప్రధాన దర్గాలో పలికి ప్రవేశించారు. అక్కడ పీరుల్లా మాలిక్ జీవ సమాధి వద్ద గుడ్డ చద్దార్, పూలమాల, అత్తరు సమర్పించిన అనంతరం వారు ఫాతెహ నిర్వహించి ప్రార్థనలు చేశారు. అక్కడి నుండి నేరుగా అరీఫుల్లా మాలిక్, అమీన్ స్వామి మొదలైన 16 మంది పూర్వపు పీఠాధిపతుల మజార్ల వద్దకు చేరుకుని గంధం, గుడ్డ చాదర్, పూలు సమర్పించారు. అనంతరం అక్కడ ఉన్న పూర్వ పీఠాధిపతుల మజార్లకు పూలు సమర్పించి గురువులచే ప్రార్థనలు చేయించారు. అక్కడి నుండి అమీన్ పీర్ దర్గా గ్రంథాలయం చేరుకున్న ముఖ్యమంత్రికి పీఠాధిపతుల వారు దర్గా విశిష్టత, ప్రాశస్త్యాన్ని, చారిత్రక వైభవాన్ని వివరించారు.

దర్గాను దర్శించడం అదృష్టం

మత సామరస్యానికి ప్రతీక అయిన కడప అమీన్ పీర్ దర్గాను సందర్శించడం తన అదృష్టంగా భావిస్తున్నాను అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ఈ దర్గా ఖ్యాతీ, మహిమలు, ప్రపంచ వ్యాప్తంగా పరిమళిస్తున్నాయంటే కులమత తేడాలు లేకుండా ప్రజలంతా ఐక్యంగా భాగస్వామ్యం కావడమే ప్రధాన కారణం అని తెలిపారు. తాను పుట్టిన సొంత జిల్లాలో.. ఇలాంటి మహత్తరమైన, మహిమాన్వితమైన దర్గా ఉండడం అదృష్టంగా భావిస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. అంతకు మించి ఆమీన్ పీర్ దర్గాను అత్యంత భక్తిశ్రద్ధలతో ఆధారిస్తున్న జిల్లా ప్రజలు ఎంతో అదృష్టవంతులని చెప్పుకొచ్చారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో అర్హులైన అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాల ఫలాలు అందివ్వగలుగుతున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పటిష్ఠంగా అమలు చేస్తూ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా, రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా మైనారిటీ ప్రజల సేవలో తరిస్తున్న మిత్రుడు ఎస్.బి.అంజాద్ బాషాకు సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆదిమూలపు సురేశ్, డిప్యూటీ సీఎం ఎస్.బి.అంజాద్ బాషా, కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, నగర మేయర్ సురేష్ బాబు, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్, కడప నగర పాలక కమీషనర్ జి.ఎస్.ఎస్. ప్రవీణ్ చంద్, తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News