విజయవాడ సెంట్రల్‌ నాదే.. ఆయనకు అంత సీన్ లేదు: వెల్లంపల్లి

Update: 2024-01-21 10:35 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ను వైసీపీ అధిష్టానం ఆ పార్టీ ఇంచార్జిగా నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఆ నియోజకవర్గంలో పాగా వేసేందుకు వెల్లంపల్లి ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా పాదయాత్ర ప్రారంభించారు. ప్రతి ఇంటికి తిరుగుతూ తనను పరిచయం చేసుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఎమ్మెల్యేగా గెలిస్తే అన్ని విధాలుగా అండగా ఉంటానంటూ హామీ ఇస్తున్నారు. అందరినీ ఆప్యాయంగా పలికరిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

ఈ సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో గెలుపుపై వెల్లంపల్లి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్‌లో తన సారథ్యంలో మరోసారి వైసీపీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. టీడీపీ నేత బోండా ఉమా ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవరని.. అసలు ఆయనకు సీటు ఉంటుందో లేదో చూసుకోవాలని హితవు పలికారు. నియోజవకర్గంలో ప్రభుత్వ పథకాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. సీఎం జగన్‌పై సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. తన పాదయాత్రను అనూహ్య స్పందన వస్తోందని వెల్లంపల్లి స్పష్టం చేశారు. సీఎం జగన్‌ను మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించుకుంటామని ప్రజలు చెబుతున్నారని ఆయన తెలిపారు. మళ్లీ జగన్ సీఎం అయితే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారని వెల్లంపల్లి పేర్కొన్నారు.

Tags:    

Similar News