AP News:న్యాయ బద్దంగా చేసే వ్యాపారాలకు సహకరిస్తాం:మంత్రి నాదెండ్ల మనోహర్

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న బియ్యం రవాణా అంశంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక దృష్టి పెట్టారు.

Update: 2024-08-13 10:32 GMT

దిశ ప్రతినిధి, కాకినాడ:కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న బియ్యం రవాణా అంశంపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ మంగళవారం కాకినాడ యాంకరేజి పోర్టు వద్ద చెక్ పోస్టులను తనిఖీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించి రేషన్ మాఫియా అక్రమాలపై విచారిస్తామని చెప్పారు. సీఐడీ గానీ, మరే ఇతర సంస్థతో గానీ విచారణ చేయిస్తామని తెలిపారు. తనిఖీలు చేపడితే ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతామని కొందరు వ్యాపారులు బెదిరిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తామంటే ఎవరూ అడ్డుకోరని, ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని నాదెండ్ల పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చేసే వ్యాపారాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించబోమని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వంలో పేదలకు సరఫరా చేయాల్సిన రేషన్ బియ్యం దళారులను పెట్టి దోచుకుని ఓడల్లో విదేశాలకు ఎత్తుకుపోయి అమ్ముకున్నారని ఆరోపించారు. గోడౌన్లలో 52 వేల మెట్రిక్ టన్నుల బియ్యం పట్టుకుంటే అందులో 22 వేల మెట్రిక్ టన్నులు పీడీఎస్ బియ్యం ఉందని గుర్తు చేశారు. కొంత మంది పెద్దలు పేదల పొట్ట కొట్టి దోచుకున్న బియ్యం ఇది అని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. చెక్ పోస్టుల ఏర్పాటు, తనిఖీల విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. కాకినాడ పోర్టు ఏ ఒక్క కుటుంబానిదీ కాదని, పోర్టును రేషన్ మాఫియాకు అడ్డాగా మార్చారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు.

యాంకరేజి పోర్టు వద్ద లారీలు ఎక్కువ సేపు ఆగకుండా మరో చెక్ పోస్ట్ ఏర్పాటు చేస్తామని,చెక్ పోస్టుల్లో మూడు షిఫ్టుల్లో ఉద్యోగులు ఉంటారని వివరించారు. తనిఖీ ప్రక్రియ త్వరగా పూర్తయ్యేలా చూస్తామని చెప్పారు. కాకినాడ పోర్ట్ లోని బొంబాయి కాటా వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్టును పరిశీలించారు. అక్కడి పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని తక్షణమే మరో చెక్ పోస్టును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఎం.డి. వీర పాండియన్,జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జిల్లా అధికారులు పాల్గొన్నారు

Read More..

ముగిసిన ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు 

Tags:    

Similar News