సీఎం జగన్ ఒక్కో మహిళ నుంచి రూ.1.82 లక్షలు దోచుకున్నారు: ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తనదైన శైలిలో తీవ్ర విమర్శలు చేశారు.

Update: 2023-10-30 12:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తనదైన శైలిలో తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కో మహిళ నుంచి జగన్ రూ. 1.18 లక్షలు దోచుకున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. అక్రమ మద్యం అమ్మకాలు, మద్యం ధరలతో మహిళను దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో నాణ్యమైన మద్యం క్వార్టర్ ధర రూ.60 ఉండేదని...వైసీపీ పాలనలో రూ.200కు చేరిందని ఆరోపించారు. అమ్మ ఒడి, వైఎస్ఆర్ చేయూత అంటూ మహిళలకు జగన్ డబ్బులు వేస్తున్నాడని... అయితే లబ్ధిదారులైన సదరు మహిళల భర్తలు రోజుకు ఒక క్వార్టర్ మద్యం తాగుతున్నారని చెప్పుకొచ్చారు. లబ్ధిదారుల భర్తలు రోజుకు ప్రభుత్వానికి రూ.140 కంటే ఎక్కువ చెల్లిస్తున్నారని అంటే ఏడాదికి రూ.50,400 ప్రభుత్వానికి తిరిగి చెల్లిస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో ఓట్లను కొనుగోలు చేయడానికి ఒక్కో ఓటుకు రూ.2 నుంచి 3 వేలను జగన్ ఇప్పిస్తాడని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆరోపించారు. వైసీపీ ఓటు కోసం ఎంత డబ్బు ఇచ్చినా ఓటర్లు తీసుకోవాలని కానీ వైసీపీకి మాత్రం ఓటు వేయోద్దని ఓటర్లను ఎంపీ రఘురామ కృష్ణంరాజు కోరారు. అంతేకాదు ఆ డబ్బు వైసీపీ ప్రభుత్వం ఎందరో మహిళల తాళిబొట్లు తెంచి సంపాదించారని ఆరోపించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున దొంగ ఓట్లను నమోదు చేసిందని... ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందా? లేదా? చెక్ చేసుకోవాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు సూచించారు.

Tags:    

Similar News