సీక్రేట్ రివీల్ చేసిన జగన్ : వైఎస్ఆర్ కల్యాణమస్తు, షాదీతోఫా పథకాలకు టెన్త్ క్లాస్, ఏజ్ నిబంధన అందుకేనట

వైఎస్ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు వారి చదువులను మరింత ప్రోత్సహిస్తున్నాం అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.

Update: 2023-11-23 09:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ‘వైఎస్ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకం ద్వారా పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక సాయం చేయడంతో పాటు వారి చదువులను మరింత ప్రోత్సహిస్తున్నాం అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ‘నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా దివ్యాంగులు, నా భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని పిల్లలు విద్యావంతులు కావాలనే 10వ తరగతి నిబంధన తెచ్చాం, వయో పరిమితి వల్ల బాల్య వివాహాలు తగ్గుతాయి’ అని సీఎం జగన్ అన్నారు. ఈఏడాది జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి వివాహం చేసుకున్న అర్హులైన 10,511 మంది జంటలకు ఈరోజు రూ.81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం జగన్‌ విడుదల చేశారు. వధువుల తల్లుల బ్యాంక్‌ ఖాతాల్లో వైఎస్ఆర్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా సాయం జమ చేశారు. పేద తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించి.. తమ పిల్లలకు గౌరవ ప్రదంగా పెళ్లీళ్లు చేసి.. పిల్లలకు వివాహ జీవితాలను మొదలుపెట్టించే కార్యక్రమంలో ఆ తల్లిదండ్రులకు సహాయంగా ఉండే మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతుందని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.

ఓట్లు, ఎన్నికలు అనేది సెకండరీ

జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న ఆ జంటలను ఆశీర్వదిస్తూ దాదాపు 10,511 మంది జంటలకు సీఎం వైఎస్ జగన్ రూ.81.64 కోట్ల ఆర్థికసాయాన్ని తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నామని....ఈ పథకంలో ఇప్పటి వరకు మూడు త్రైమాసికాల్లో ఆర్థికసాయం అందజేయడం జరిగిందని తెలిపారు. 2022 అక్టోబర్‌నుంచి మొదలుపెడితే ఈరోజు ఇస్తున్న నాలుగో విడతతో కలిపి మొత్తం 46,062 జంటలకు రూ.349 కోట్లు ఆ తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లు అవుతుందని సీఎం జగన్ వెల్లడించారు. వైఎస్ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకానికి పదో తరగతి ఉత్తీర్ణత, 18 సంవత్సరాలు, 21 సంవత్సరాల నిబంధన ఎందుకు పెట్టాలని తనతో చాలా మంది అన్నారని గుర్తు చేశారు. 10 తరగతి ఉత్తీర్ణత నిబంధన లేకపోతే మనకు ఇంకా ఎక్కువ ఓట్లు వస్తాయని తనతో చాలా మంది అన్నారని...ఓట్లు, ఎన్నికలు అనేది సెకండరీ అని, లీడర్లుగా మనం ఉన్నప్పుడు మన సంకల్పం మంచిదై ఉండాలని విజన్‌ అనేది చాలా ముఖ్యమని సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు.


గతంలో కంటితుడుపుగా..

గత ప్రభుత్వంలో ఇదే పథకానికి సంబంధించి 10వ తరగతి నిబంధన లేదని... ఇచ్చేది ఏదో అరకరగా ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి నెలకొందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. 2018లో ఏకంగా పథకాన్నే నీరుగార్చారని విమర్శించారు. గత ప్రభుత్వంలో అర్హులందరికీ ఇచ్చే పరిస్థితి లేదని, ఎప్పుడు ఇస్తారో అంతకంటే తెలియదుని, సాయం చేయడంలో పారదర్శకత అంతకంటే లేదని..2018 వచ్చేసరికి ఏకంగా చేతులు ఎత్తేశారని ఆరోపించారు. మనం చిత్తశుద్ధితో, మోటివేషన్‌తో, పారదర్శకతతో ప్రతి ఒక్కరికీ మంచి జరిగించాలని, ఏ ఒక్కరూ మిస్‌ కావొద్దనే తపనతో ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఒక నెల పరిశీలన తరువాత మరుసటి నెల నూతన వధూవరులకు సంబంధించిన వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధులు తల్లుల ఖాతాల్లోకి జమ చేసే పద్ధతిని తీసుకువచ్చామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.‘గత ప్రభుత్వంలో మైనార్టీలకు రూ.50 వేలు మాత్రమే అది కూడా కొంతమందికే, ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి నుంచి.. ఈరోజు మన ప్రభుత్వంలో మైనార్టీ షాదీ తోఫా కింద రూ.1 లక్ష సాయంతో పాటు పిల్లలను చదివించడం కోసం 10వ తరగతి నిబంధన పెట్టాం. దివ్యాంగులకు రూ.1.5 లక్షల సాయం అందిస్తున్నాం. గత ప్రభుత్వం ఎస్సీలకు రూ.40 వేలు ఇస్తే.. మన ప్రభుత్వంలో రూ.1 లక్ష అందిస్తున్నాం. గత ప్రభుత్వం ఎస్టీలకు రూ.50 వేలు మాత్రమే ఇస్తే.. మన ప్రభుత్వంలో రూ.1 లక్ష సాయం అందిస్తున్నాం’ అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.

గొప్ప మార్పునకు చిహ్నం

గత ప్రభుత్వంలో బీసీలకు రూ.35 వేలు మాత్రమే ఇస్తే.. మనం రూ.50 వేలు అందిస్తున్నాం అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.‘కులాంతర వివాహాలకు మన ప్రభుత్వంలో రూ.1.25 లక్షల సాయం అందిస్తున్నాం. ఇవన్నీ చదువులను ప్రోత్సహించడం కోసం, తల్లిదండ్రులు పిల్లలను చదివించే దిశగా అడుగులు వేయించడం కోసం అడుగులు వేస్తున్న గొప్ప కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ద్వారా నూతన వధూవరులకు మంచి జరగాలని మనసారా కోరుకుంటున్నాను’అని సీఎం జగన్ అన్నారు. ‘నాల్గవ విడతలో వైయస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా అందిస్తున్న జంటల్లో 8,042 మందికి అమ్మ ఒడి లేదా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన కింద ప్రయోజనాలు అందాయని, ఇది నిజంగా గొప్ప మార్పునకు చిహ్నమని, ఇది ఇక్కడితో ఆగిపోకుండా రాబోయే నెలలు, సంవత్సరాల్లో 10 శాతం రిజిస్టర్‌ కావాలని తపన, తాపత్రయపడుతున్నా అని’ సీఎం వైఎస్ జగన్ తన ఆకాంక్షను తెలియజేశారు.

Tags:    

Similar News