లావు చూపు ఎటువైపు.. చర్చనీయాంశంగా లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యవహారం

ఏపీలో అధికార పార్టీ ఇన్ చార్జిల మార్పులో భాగంగా పార్టీని వీడిన వైసీపీ నేతలు మళ్లీ అధికార పార్టీలోకి చేరతారనే వార్తలు ఊపందుకున్నాయి

Update: 2024-02-22 11:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:  ఏపీలో అధికార పార్టీ ఇన్ చార్జిల మార్పులో భాగంగా పార్టీని వీడిన వైసీపీ నేతలు మళ్లీ అధికార పార్టీలోకి చేరతారనే వార్తలు ఊపందుకున్నాయి. ఇదే కారణంతో పార్టీని వీడిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి, తిరిగి వైసీపీ గూటికి చేరారు. ఈ నేపధ్యంలోనే మరికొందరు నేతలు కూడా తిరిగి పార్టీలో చేరే అవకాశం ఉందని, ఈ పరంగా వైసీపీలోని కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందులో నరసరావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ముందు వరసలో ఉన్నారని అంటున్నారు.

లావు శ్రీకృష్ణదేవరాయలును కూడా ఇన్ చార్జీల మార్పులో భాగంగా నరసరావుపేట స్థానం నుంచి తప్పించడంతో వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసి నెల గడుస్తున్న ఆయన ఏ నిర్ణయం ప్రకటించకపోవడం పలు అనుమానాలకు తావిస్తొంది. కొద్ది రోజుల క్రితం ఆయన టీడీపీలో చేరతారని విసృతంగా ప్రచారం జరిగింది. దీనిపై ఆయన నుంచి స్పందన రాకపోవడంతో అదే నిజం అవుతుందని అంతా అనుకున్నారు. ఈ ప్రచారానికి బలం చేకూరేలా.. టీడీపీ నేతలు కూడా ఎక్కడా ఆయనపై విమర్శలు చేయకపోవడం గమనార్హం.

ఇదిలా ఉండగా పార్టీని వీడిన ఆళ్ల తిరిగి సొంత గూటికి చేరడంతో.. తర్వాత వరుసలో లావు ఉన్నారని, వైసీపీ నేతలతో మంతనాలు పూర్తి అయ్యాయని, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై లావు ట్విట్టర్ లో నేను ఎవరి అపాయింట్ మెంట్ కోసం వేచి చూడట్లేదు అని స్పందించారు. ఏ పార్టీలో చేరతారు అని ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి.. మంచి రోజు కాదు, త్వరలో మంచి రోజు చూసి చెబుతా అని దాటవేసే ప్రయత్నం చేశారు. నెల రోజుల నుంచి తన తదుపరి కార్యచరణ ప్రకటించకపోవడంతో.. చర్చలు ఇంకా పూర్తి కాలేదా..?, ఆహ్వానాల కోసం ఎదురు చూస్తున్నారా..? లేక సోషల్ మీడియా వార్తలను నిజం చేస్తారా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Tags:    

Similar News