వందేళ్లలో ఇంతటి కరవు చూడలేదు.. 393మండలాల్లో కరవు తాండవం: అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో గత వందేళ్లలో ఇంతటి కరవు పరిస్థితులు చూడలేదు.

Update: 2023-10-27 08:22 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలో గత వందేళ్లలో ఇంతటి కరవు పరిస్థితులు చూడలేదు. సాగునీరు అందక కళ్లముందే పంటలు ఎండిపోతున్నా జగన్ రెడ్డికి రైతులపై కనీస కనికరం లేదు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరవు, దుర్భిక్ష పరిస్థితులపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ స్టీరింగ్ కమిటీ సమావేశమైంది.రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, కళ్లముందే ఎండిపోతున్న పంటలను కాపాడటంలో జగన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యంపై నేతలు విస్తృతంగా చర్చించారు. రాష్ట్రవ్యాప్తంగా కరవు, రైతు సమస్యలపై నవంబర్ నెలలో తెలుగుదేశం పార్టీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రణాళిక రూపకల్పన చేసింది.ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ...‘కరవు భయపెడుతున్నా నివారణ చర్యలపై జగన్ రెడ్డి, వ్యవసాయ, ఇరిగేషన్ మంత్రులకు కనీస స్పృహ లేదు అని ఆరోపించారు. ఖరీఫ్‌లో 40 లక్షల ఎకరాల్లో పంటే వేయలేదు. వేసిన పంటల్లో నీరు అందక మూడొంతులు దెబ్బతిన్నాయి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, పల్నాడు, కృష్ణా డెల్టా, గోదావరి జిల్లాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఉన్నాయి.రాయలసీమలో 18 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సిన వేరుశనగ పంట ఈ ఏడాది కేవలం 7 లక్షల ఎకరాల్లోనే సాగైంది. అది కూడా ఆ పంటకు సాగునీరు అందక ఎండిపోతున్నాయి’అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

తెలివితక్కువ సీఎం వల్లే ఈ దుస్థితి

రాష్ట్రంలో ఉద్యానపంటలకు సాగు నీరు అందడం లేదు. కూరగాయల పంటలు కూడా దెబ్బతిన్నాయి అని అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కరవు నెలకొని ఉందన్నారు. పట్టిసీమను సక్రమంగా వినియోగించుకోకపోవడం వల్ల 40 టీఎంసీల నీరు కోల్పోయాం అని అచ్చెన్నాయుడు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా పట్టిసీమ పంపులకు బూజు పట్టించారని మండిపడ్డారు. నీటి నిర్వహణపై జగన్ రెడ్డి పూర్తిగా వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు. కరవు ఇంత తీవ్రస్థాయిలో ఉంటే కనీస సమీక్షలు లేవు అని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు వర్షాభావ పరిస్థితుల్లో పొట్టదశలో ఉన్న వరి పంట దెబ్బతింది అని ఆరోపించారు. సాగునీటి పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి వైఖరి కారణంగా కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా కోల్పోతే వ్యవసాయ రంగం తీవ్ర ప్రమాదంలో పడుతుంది. లేఖలతోనే ముఖ్యమంత్రి సరిపెడుతున్నారు. తెలివితక్కువ సీఎం, సాగునీటి శాఖ మంత్రి, వ్యవసాయ మంత్రికి కనీస బాధ్యత లేదు. సాగునీటితో పాటు తాగునీటికీ ఎద్దడి ఉందన్నారు. రైతులకు ఆరుతడి పంటలకు కూడా నీళ్లివ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రతిపక్ష నేతపై విమర్శలు చేయడంపై పెట్టిన శ్రద్ధ రైతులపై పెట్టడం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.


కర్ణాటక ప్రమాదానికి జగన్ రెడ్డి విధానాలే కారణం

కర్ణాటక రోడ్డు ప్రమాదంలో 13 మంది మరణించడానికి జగన్ రెడ్డే విధానాలే కారణం అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. కరవు నివారణ చర్యలు చేపట్టకపోవడం వల్లే బతుకుదెరువు కోసం అనంత వాసులు కర్ణాటకకు వెళ్లి ప్రమాదంలో మృత్యువాత పడ్డారు అని తెలిపారు. రాష్ట్రంలో ఉపాధి లభించి ఉంటే 13 మంది మరణించే వారు కాదు కదా అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.

రాయలసీమలో తీవ్ర కరవు

రాష్ట్రంలో 679 మండలాలకు గాను 393 మండలాల్లో కరవు ఉంది అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. కరవు వల్ల కర్ణాటకలో రూ.30వేల కోట్ల నష్టం వచ్చిందని అక్కడి ప్రభుత్వం కేంద్రానికి నివేదికలు పంపగా.. రాష్ట్రంలో కనీసం కరవు మండలాలను ప్రకటించలేదు అని మండిపడ్డారు. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా కరవు మండలాలను ప్రకటించాలి. పంట దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలి అని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో ఉన్న నీటిని కూడా వృధా చేస్తున్నారు అని విరుచుకుపడ్డారు. గోదావరి జిల్లాల్లోనూ సాగునీటి ఎద్దడి నెలకొని ఉందన్నారు. చంద్రన్న ప్రభుత్వం సకాలంలో సాగునీరు అందించడం జరిగింది. ప్రస్తుతం కాలువల్లో పూడికతీత తీయకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని మండిపడ్డారు. కాలువల ద్వారా భూములకు నీరు అందడం లేదు. ఏ లిఫ్ట్ ఇరిగేషన్ పనిచేయకపోవడం వల్ల మెట్టరైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. వ్యవసాయానికి పగటిపూటే 9 గంటలు కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చి.. 4 గంటలు కూడా సరఫరా చేయడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పంటలు ఎండిపోతున్నాయన్నారు. గోదావరి డెల్టాలో రెండో పంటకు కూడా నీరివ్వలేమని చెప్పడం జగన్ రెడ్డి అసమర్థతకు నిదర్శనమన్నారు. ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉపశమన చర్యలు చేపట్టలేదన్నారు. రాయలసీమలో తీవ్ర కరవు ఉందన్నారు. అనంతపురంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా కరవు, రైతు సమస్యలపై నవంబర్ నెలలో తెలుగుదేశం పార్టీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పర్యటనలకు ప్రణాళిక రూపకల్పన చేయడం జరిగింది. రైతుల తరపున టీడీపీ పోరాడుతుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, కూన రవికుమార్, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బీసీ జనార్థన్ రెడ్డి, మిర్చియార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News