Nagarjuna Sagar Reservoir:నాగార్జునసాగర్ జలాశయానికి భారీగా వరద నీరు.. 8 గేట్లు ఎత్తి నీటి విడుదల
ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది.
దిశ,వెబ్డెస్క్:ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో నాగార్జునసాగర్ జలకళ సంతరించుకుంది. ఈ క్రమంలో సాగర్ జలాశయానికి భారీగా వరద నీరు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలో 8 క్రస్ట్ గేట్లు ఎత్తారు. ప్రతి గేటును 5 అడుగుల మేర ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో 64,800 క్యూసెక్కుల వరద నీటిని ప్రాజెక్టు అధికారులు దిగువకు పంపిస్తున్నారు.
ఈ సీజన్లో మొదటిసారిగా ఆగస్టు 5న క్రస్ట్గేట్ల ద్వారా నీటి విడుదల ప్రారంభించగా సాగర్కు వరద పోటెత్తడంతో సెప్టెంబర్ 19 వరకు కొనసాగింది. రెండు విడతల్లో 435 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేశారు. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 490 అడుగులు కావడంతో అధికారులు బుధవారం ఉదయం 2 క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల చేశారు. సాగర్ జలాశయానికి వచ్చే ఇన్ ఫ్లో ఆధారంగా క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల చేపడతామని ప్రాజెక్టు అధికారులు తెలిపారు.