Chandrababu: ఆయనే తొలిసారి..ఆయనే ఆఖరిసారి

షెడ్యూల్ కులాలకు టీడీపీ చేసిన పనులు ఎవరూ చేయలేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ...

Update: 2023-04-28 14:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: షెడ్యూల్ కులాలకు టీడీపీ చేసిన పనులు ఎవరూ చేయలేదని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్రకార్యాలయంలో ‘దళిత ద్రోహి జగన్ రెడ్డి’ అనే అంశంపై దళిత నేతలతో జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ‘‘ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణంలో ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. తొలిసారి ఎస్సీలకోసం గురుకుల పాఠశాలలు పెట్టించారు. మానవవనరుల అభివృద్ధి కిందితరగతుల్లో రావాలనే, విద్య, వైద్యం వంటివాటికి ఇచ్చాము. అంటరానితనం నిర్మూలన కోసం జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి, ఆ కమిషన్ ఇచ్చిన 42 రికమండేషన్స్ అమలు చేసి, దళితుల స్వేఛ్చ, సమానత్వాలతో సమాజంలో గౌరవంగా బతికేలాచేశాను. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కేసులు పెట్టి, కఠినశిక్షలు అమలు చేయించాను. ఎస్సీ,ఎస్టీలకు ప్రత్యేకంగా కమిషన్లు, కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది తెలుగుదేశం పార్టీనే.’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయిన తర్వాత కార్పొరేషన్లను నిర్వీర్యం చేశారని గుర్తు చేశారు. కేంద్రప్రభుత్వం ఇచ్చే కొన్ని పథకాలకు రాష్ట్రప్రభుత్వ వాటాగా ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వలేదని చంద్రబాబు తెలిపారు.

దళితులను రాజకీయంగా అభివృద్ధి చేశాం

వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగేళ్లుగా ఎస్సీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని రూపాయి కూడా ఖర్చు చేయలేదని చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఎస్సీ సబ్ ప్లాన్‌కు నిధులు కేటాయించలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం దళితుకోసం 28ప్రత్యేక పథకాలు అమలు చేస్తే వైసీపీ ప్రభుత్వం ఒక్కకార్యక్రమం కూడా అమలు చేయలేదని తెలిపారు. ‘‘ఎస్సీకాలనీల్లో 6 వేలకిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసిన ఘనత టీడీపీదే. అన్ని ఇళ్లకు 100 యూనిట్ల ఉచిత కరెంట్ ఇచ్చాం. అలానే కాలనీల్లో మరుగుదొడ్లు నిర్మించాం. వీటిపై సవాల్ విసిరితే ఇక మాట్లాడలేరు. తొలిసారి 2001లో జస్టిస్ పున్నయ్య కమిషన్ వేసి 42 రికమండేషన్స్ అమలుచేసింది టీడీపీయే. దాని అమలుకోసం 18 జీవోలు ఇచ్చాం. అలాగే ఎస్సీ రిజర్వేషన్లను 14 శాతంనుంచి జనాభా దామాషా ప్రకారం పెంచాం. ఎస్టీలకు 4 నుంచి 6శాతానికి పెంచాం.. ఎన్టీఆర్ నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్‌గా ఉన్నప్పుడు పట్టు బట్టి చొరవచూపి మహానుభావుడు అంబేద్కర్‌కి భారతరత్నవచ్చేలా చేశారు. బాలయోగిని తొలిసారి లోక్ సభ స్పీకర్‌ని చేశాం. కే.ఆర్.నారాయణన్‌ను రాష్ట్రపతిగా ఎంపికచేయడంలో టీడీపీ కీలకపాత్ర పోషించింది. మహేంద్రనాథ్‌ను రాష్ట్ర తొలి ఆర్థికమంత్రిగా నియమించాం. కాకి మాధవరావుని రాష్ట్ర చీఫ్ సెక్రటరీని చేశాం. ఆయనే తొలిసారి..ఆయనే ఆఖరిసారి. ప్రతిభా భారతిని అసెంబ్లీ స్పీకర్‌ని చేశాం.’’ అని చంద్రబాబు గుర్తు చేశారు.

ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాం

ఉద్యోగాలకే పరిమితమైన రిజర్వేషన్లను తాను ముఖ్యమంత్రి అయ్యాకే ప్రమోషన్లకు కూడా వర్తింపచేశానని చంద్రబాబు వెల్లడించారు. దళితులకు భద్రతతోకూడిన ఆస్తి ఉండాలని భూమికొనుగోలు పథకం తీసుకొచ్చి, భూములుకొని దళితులకు ఇచ్చింది దేశంలో ఒక్కతెలుగుదేశం పార్టీయేనని స్పష్టం చేశారు. అంబేద్కర్ విదేశీవిద్య పథకం అమలు చేసి 440 మంది దళిత యువతీ యువకుల్ని విదేశాలకు పంపించినట్లు తెలిపారు. తాను అంబేద్కర్ పేరు పెడితే, అది తీసేసి జగనన్న అని పెట్టారు. 4ఏళ్లలో కేవలం 10మందికి డబ్బులిచ్చి పేరుమార్చారని విమర్శించారు. దళితయువతకు ఇన్నోవా కార్లు ఇచ్చింది టీడీపీయేనని స్పష్టం చేశారు. చిన్నతరహాపరిశ్రమలు పెట్టుకోవాలనుకునేవారికి రూ.75లక్షల సబ్సిడీ ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమేనని చెప్పారు. రాజధాని అమరావతిలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహంతో పాటు, స్మృతివనం ఏర్పాటుకు బీజంవేస్తే దాన్ని ఆపేశారని తెలిపారు. అంబేద్కర్ విగ్రహంతోపాటు, బాబూ జగజ్జీవన్ రామ్ విగ్రహాం పెట్టాలనుకున్నామని తెలిపారు. ‘దళిత విద్యార్థులు మట్టిలో మాణిక్యాలు. వారిని విద్యలో ప్రోత్సహించాలనే బెస్ట్ అవైల బుల్ స్కూళ్లను తీసుకొచ్చాను. ప్రైవేట్ స్కూళ్లకంటే మిన్నగా సౌకర్యాలు ఉండేలా గురుకుల పాఠశాలల్ని ఏర్పాటు చేశాం. వైఎస్ జగన్ వచ్చాక ఎక్కడైనా ఒక్క రెసిడెన్షియల్ పాఠశాల పెట్టాడా?. పేద పిల్లల చదువుకు దూరం కాకూడదని ‘బడిపిలుస్తోంది’ ‘మళ్లీ బడికి’ వంటి కార్యక్రమాలు అమలు చేశాం. 1997లో టీడీపీ ప్రభుత్వం అంటరానితనం నిర్మూలనకు శ్రీకారం చుట్టింది. మలుపు, ముందడుగు వంటి పథకాలు దళితుల కోసమే తీసుకొచ్చాం. పేదరికం - జనాభా ప్రకారంగా పథకాలు అమలుచేశాం.’ అని చంద్రబాబు వెల్లడించారు.

Tags:    

Similar News