విశాఖ డైనో పార్క్ ప్రమాదంపై అనుమానాలు.. కావాలని చేశారా?

విశాఖ డైనో పార్క్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి....

Update: 2024-08-14 02:14 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ డైనో పార్క్‌లో జరిగిన అగ్ని ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుట్రలో భాగంగానే నిప్పు పెట్టినట్లుగా స్థానిక పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో పోలీసులు కూడా అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదం వీడియోలు, ఫోటోలు రాష్ర్ట వ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విశాఖలో జరిగిన ఈ ప్రమాదాన్ని రాష్ర్ట ప్రభుత్వం కూడా తీవ్రంగా పరిగణించింది. ముఖ్యమంత్రి పేషీ వెంటనే స్పందించి నివేదిక సమర్పించాల్సిందిగా అదేశించింది.


జీవీఎంసీలోని వైసీపీ పెద్దల పాపం ఈ లీజ్..

బీచ్ రోడ్‌లో వ్యాపార సముదాయాలను తొలగించాల్సిందిగా హైకోర్టు గతంలో పలు సందర్బాల్లో ఆదేశాలు జారీ చేసింది. హరినారాయణ కమిషనర్‌గా ఉన్నప్పుడు కొన్నింటిని తొలగించారు. అయితే, లక్ష్మీ షా కమిషనర్‌గా వచ్చిన తరవాత వైసీపీ పాలక వర్గం ఉండడంతో వారి ఒత్తిడికి తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా లీజ్‌లను పొడిగించారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో కిలపర్తి శ్రీనివాస్ అనే వ్యక్తి సిల్వర్ స్పూన్ రెస్టారెంట్ పేరిట లీజ్‌కు తీసుకొన్నారు. లీజుకు ఇచ్చింది 480 గజాలే అయినప్పటికీ సుమారు 2,000 గజాలను తన ఆధీనంలో ఉంచుకొని డైనో పార్క్‌తో పాటు పలువురికి సబ్ లీజ్‌గా ఇచ్చారు. వైసీపీ ఉత్తర ఇన్చార్జి కే కే రాజు, జీవీఎంసీలో వైసీపీ పక్షనేత బాణాల శ్రీనివాస్‌ల ప్రమేయంతో లీజులు, సబ్ లీజులు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. లీజుదారుడు లీజు మేరకే ఉన్నాడా? లీజులో పేర్కొన్న వ్యాపారమే చేస్తున్నాడా? అందుకు అవసరమైన నిబంధనలు పాటిస్తున్నాడా అన్న వాటిని సంబంధిత జీవీఎంసీ అధికారులు ఎన్నడూ పట్టించుకోలేదు. చివరకు ప్రమాదం జరిగిన పార్క్‌కు ఫైర్ లైసైన్స్ లేదనే విషయం ప్రమాదం జరిగే వరకూ జీవీఎంసీకి తెలియనే తెలియదు.

కొత్త లీజుల కోసం అగ్ని ప్రమాదం

ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలోని మరో వ్యాపార సముదాయాన్ని జీవీఎంసీ పరిధిలోకి వచ్చే అనకాపల్లి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధి ప్రోద్బలంతో రంజిత్, హరీష్ అనే వ్యక్తులు ఇటీవల తీసుకొన్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది. వారు సిల్వర్ స్పూన్ కబ్జాలో ఉన్న మిగిలిన స్థలంపై కన్నేసి ఓత్తిడి తీసుకువచ్చారన్న దానిపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణం చల్లగా ఉండి చినుకులు పడుతున్న సమయంలో ప్రమాదం జరగడం సంచలనంగా మారింది. ప్లాస్టిక్ బొమ్మలు, ఇనుప ప్రేమ్‌లతో చేసిన బొమ్మలతో కూడిన డైనో పార్క్‌లో అగ్ని ప్రమాదానికి ఆస్కారమే లేదని అంటున్నారు. ఎవరో కావాలని చేశారన్న అనుమానంతో సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజిని పరిశీలిస్తున్నారు.

Tags:    

Similar News