ఓటర్ల జాబితాల ఇంటింటి పరిశీలనను వినియోగించుకోవాలి: మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్

కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా తలపెట్టిన‘ఓటర్ల జాబితాల ఇంటింటి పరిశీలన’కార్యక్రమాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిలుపునిచ్చారు.

Update: 2023-12-01 09:21 GMT

దిశ , డైనమిక్ బ్యూరో : కేంద్ర ఎన్నికల సంఘం డిసెంబర్ 2, 3 తేదీల్లో దేశవ్యాప్తంగా తలపెట్టిన‘ఓటర్ల జాబితాల ఇంటింటి పరిశీలన’కార్యక్రమాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పిలుపునిచ్చారు. సక్రమమైన ఓటర్ల జాబితాల తయారీలో ఓటర్లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బూత్ లెవల్ అధికారులు డిసెంబర్ 2 ,3 తేదీల్లో పోలింగు బూతుల వద్ద ఓటర్ల జాబితాల పరిశీలన చేపడతారన్నారు. ఓటర్లు అప్రమత్తంగా ఉంటూ మార్పులు, చేర్పులు, తొలగింపులు, సక్రమంగా ఉన్నదీ లేనిదీ చూసుకోవాలని రమేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. పౌరులందరికీ రాజ్యాంగం కల్పించిన ఓటుహక్కును వినియోగించుకోవడానికి సక్రమమైన ఓటర్ల జాబితాలు కీలకమని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఓటర్ల జాబితాల పరిశీలనకు బూత్ లెవెల్ అధికారులు పోలింగ్ బూత్‌లలో ఉన్న సమయంలో ఓటర్లు తప్పనిసరిగా బూత్‌లకు వెళ్ళాలని సూచించారు. బూత్ లెవెల్ అధికారుల వద్దకు వెళ్ళే సమయంలో నిబంధనల మేరకు నివాస ధృవపత్రం సహా అన్ని రకాల పత్రాలను వెంట ఉంచుకోవాలని కోరారు. జాబితాలో తమ పేర్లు గానీ , కుటుంబ సభ్యులపేర్లు గానీ లేనిపక్షంలో ఫారం 6 ను సమర్పించాలని , తమ ఇంటి నంబరులో కుటుంబానికి సంబంధంలేని వ్యక్తులపేర్లు ఉంటే వాటి తొలగింపు కోసం ఫారం 7 ను సమర్పించాలని సూచించారు. కుటుంబ సభ్యుల పేర్లు వేర్వేరు బూత్‌లలో చెల్లా చెదురుగా నమోదై ఉంటే ...వారు ఒకే బూత్ జాబితాలోకి మార్చేందుకు ఫారం 8 సమర్పించాలన్నారు. సమర్పించిన ఫారాలకు తగిన రసీదు కూడా పొందాలని సూచించారు. రాష్ట్రంలో ఫారం 7 ను దుర్వినియోగం చేసి పలువురు అసలైన ఓటర్ల పేర్లను జాబితాల నుండి తొలగించినట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయని.. అందులో మూకుమ్మడి దరఖాస్తులు కూడా ఉన్నాయని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి డా.నిమ్మగడ్డ రమేష్ కుమార్ గుర్తు చేశారు.

ఓటు హక్కును తిరిగి పొందవచ్చు

రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి జారీచేసిన మార్గదర్శకాల ప్రకారం మూకుమ్మడి తొలగింపుల పరిశీలన కోసం ప్రతి నియోజకవర్గంలో ముగ్గురు అధికారులతో కూడిన కమిటీ ఉంటుందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పుకొచ్చారు. ఆ కమిటీ ఆమోదంతోనే తొలగింపులు చేపట్టాల్సి ఉంటుందని...ఈ విషయాన్ని ఓటర్లు, రాజకీయ పక్షాల కార్యకర్తలు గమనంలో ఉంచుకోవాలని సూచించారు. నివాస గృహంలో ఉండటం లేదన్న పేరుతో ఓటర్ల పేర్లను అధికారులు పెద్ద ఎత్తున తొలగిస్తున్న ధోరణి కూడా రాష్ట్రంలో కనిపిస్తుందన్నారు. కరోనా అనంతరం ఉద్యోగ , వ్యాపార వ్యవహారాల కోసం స్వగ్రామాల నుండి , ఇంటి నుండి పని చేస్తున్నారని వారి పని పరిస్థితుల ఆధారంగా ఓటు హక్కు కల్పించాల్సిన అవసరం ఉంటుందని నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. అధికారుల అజాగ్రత్త కారణంగా ఓటు హక్కును కోల్పోయినట్లైతే అటువంటి ఓటర్లు హైకోర్టును ఆశ్రయించి తమ హక్కును తిరిగి పొందవచ్చునని సూచించారు. రాష్ట్రంలో నిష్పాక్షిక , స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలు జరిగేందుకు వీలుగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కృషి చేస్తున్నదని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ఈ విషయంలో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని... సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వెల్లడించారు. సక్రమమైన ఓటర్ల జాబితాల తయారీలో అధికారులకు , ఓటర్లకు సహకరించేందుకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిరంతరం అందుబాటులో ఉంటుందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రధాన కార్యదర్శి డా. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు.

Tags:    

Similar News