‘దిశ యాప్’ డౌన్లోడ్ వివాదం : జవాన్పై పోలీసుల దాడి... చర్యలకు డీజీపీ ఆదేశం
దిశ యాప్ డౌన్లోడ్ చేయించే క్రమంలో ఓటీపీ నమోదు చేసుకోవడంపై అభ్యంతరం చెప్పినందుకు జవానుపై పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో : దిశ యాప్ డౌన్లోడ్ చేయించే క్రమంలో ఓటీపీ నమోదు చేసుకోవడంపై అభ్యంతరం చెప్పినందుకు జవానుపై పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి పాల్పడిన కానిస్టేబుళ్లను స్థానికులు నిలదీయడంతో ఆ వీడియో వైరల్గా మారిన సంగతి తెలిసిందే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ప్రభుత్వం సైతం దృష్టి సారించింది. అనకాపల్లి జిల్లా పరవాడ సంతబయలులో ఆర్మీ ఉద్యోగి అలీముల్లాపై మంగళవారం కానిస్టేబుళ్ల దాడి చేసిన ఘటనపై అనకాలపల్లి ఎస్పీ కేవీ మురళీకృష్ణ విచారం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ తరహా ఘటనలను తాము ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పరవాడ పీఎస్ పరిధిలో కొంతమంది పోలీసు సిబ్బంది వ్యవహరించిన తీరుకు తాను చింతిస్తున్నట్లు తెలిపారు. బాధ్యులైన నలుగురు పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేస్తున్నట్లు ఎస్పీ కేవీ మురళీకృష్ణ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై డీజీపీ స్పందించారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
దాడికి గల కారణాలేంటంటే?
అనకాపల్లి జిల్లా పరవాడ సంతబయలులో ఆర్మీ ఉద్యోగి అలీముల్లాపై కానిస్టేబుళ్ల దాడిపై డీజీపీ కార్యాలయం స్పందించింది. ఈ దాడికి పాల్పడిన నలుగురు కానిస్టేబుళ్లను తక్షణమే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ మేరకు రేంజ్ డీఐజీ, జిల్లా ఎస్పీ కేవీ మురళీకృష్ణలకు డీజీపి రాజేంద్రనాధ్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇకపోతే ఈనెల 7న అనకాపల్లి జిల్లా పరవాడ సంతబయలు వద్ద ఆర్మీజవాన్ సయ్యద్ అలీమ్ ముల్లా మెుబైల్లో దిశ యాప్ డౌన్లోడ్ చేయించే క్రమంలో ఓటీపీ నమోదు చేసుకోవడంపై జవాన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు ఆగ్రహానికి గురై జవాన్పై దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడిన కానిస్టేబుళ్లను స్థానికులు నిలదీయడంతో ఆ వీడియో వైరల్గా మారింది. పోలీసుల దాడిని స్థానికులు అడ్డుకుని నిలదీయడంతో అతడిని వదిలేశారు. ఈ ఘటనపై బాధితుడు మంగళవారం సాయంత్రం ఎస్పీ కేవీ మురళీకృష్ణకు ఫిర్యాదు చేశారు. దీంతో మంగళవారం రాత్రి బాధ్యులను వీఆర్కు పంపించారు. అనంతరం జవానుపై దాడి చేసిన కానిస్టేబుళ్లు ముత్యాల నాయుడు, శోభ,హెడ్ కానిస్టేబుల్ దేవల్లు, రమేశ్లపై సస్పెన్షన్ వేటు వేశారు.