చంద్రబాబు బహిరంగ లేఖపై గందరగోళం: జైలు సూపరింటెండెంట్ వివరణ ఇదే
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు భారీ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే.
దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు భారీ బహిరంగ లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఈ లేఖ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఈ లేఖపై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ స్పందించారు. ఈ లేఖ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు నుంచి వచ్చింది కాదని వివరణ ఇచ్చారు. జైలు నిబంధనల ప్రకారం ముద్దాయిలు ఎవరైనా సంతకం చేయబడిన లేఖలు పంపాలంటే ముందుగా అధికారులు పరిశీలిస్తారని రాహుల్ గాంధీ మీడియాకు తెలిపారు. సంబంధిత అధికారులు ధ్రువీకరించి.. ఆయన సంతకం, స్టాంప్ వేసిన తర్వాతే బయటకు వస్తుందని సూపరిండెంట్ రాహుల్ గాంధీ వెల్లడించారు. ప్రస్తుతం చంద్రబాబు పేరుతో చలామణి అవుతున్న లేఖకు, రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు ఎలాంటి సంబంధం లేదని సూపరింటెండెంట్ రాహుల్ వివరణ ఇచ్చారు.
నేను తప్పు చేయను, చేయనివ్వను
ఇకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు ఆదివారం సాయంత్రం ప్రజలకు లేఖ రాశారు. ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని లేఖలో చంద్రబాబు లేఖలో తెలిపారు. ఆలస్యమైనా న్యాయమే గెలుస్తుందని...త్వరలోనే బయటికొస్తానని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. తాను జైలులో లేనని.. ప్రజల హృదయాల్లో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ‘ఓటమి భయంతో జైలు గోడల మధ్య బంధించి ప్రజలకి నన్ను దూరం చేశామనుకుంటున్నారు. నేను ప్రస్తుతం ప్రజల మధ్యలో లేకపోవచ్చు. అభివృద్ధి రూపంలో ప్రతీ చోటా కనిపిస్తాను. సంక్షేమం పేరు వినిపించిన ప్రతీసారి నా పేరే తలుస్తారు. ప్రజల్నించి ఒక్క రోజు కాదు, ఒక్క క్షణం కూడా నన్ను దూరం చేయలేరు. నేను జైలులో లేను, ప్రజల హృదయాల్లో ఉన్నాను’అంటూ తనకు ప్రజలతో ముడిపడిన అనుబంధాన్ని లేఖలో నారా చంద్రబాబు వివరించారు. ములాఖత్లో భాగంగా తనను కలిసిన కుటుంబసభ్యులకు తెలుగు ప్రజలను ఉద్దేశించి తాను రాసిన లేఖని అందజేశారు. ‘నేను జైలులో లేను. మీ అందరి గుండెల్లో ఉన్నాను. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజాచైతన్యంలో ఉన్నాను. విధ్వంస పాలనని అంతం చేయాలనే మీ సంకల్పంలో ఉన్నాను. ప్రజలే నా కుటుంబం. జైలు గోడల మధ్య కూర్చుని ఆలోచిస్తూ ఉంటే 45 ఏళ్ల ప్రజాజీవితం నా కళ్ల ముందు కదలాడుతోంది. నా రాజకీయ ప్రస్థానమంతా తెలుగు ప్రజల అభివృద్ధి .. సంక్షేమమే లక్ష్యంగా సాగింది. దీనికి ఆ దేవుడితో పాటు మీరే సాక్ష్యం.ఓటమి భయంతో నన్ను జైలు గోడల మధ్య బంధించి ప్రజలకి దూరం చేశామనుకుంటున్నారు. నేను మీ మధ్య తిరుగుతూ ఉండకపోవచ్చు. కానీ అభివృద్ధి రూపంలో ప్రతీ చోటా కనిపిస్తూనే ఉంటాను. సంక్షేమం పేరు వినిపించిన ప్రతీసారి నేను గుర్తుకొస్తూనే ఉంటాను. ప్రజల్నించి ఒక్క రోజు కాదు కదా!, ఒక్క క్షణం కూడా నన్ను దూరం చేయలేరు. కుట్రలతో నాపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారు కానీ.. నేను నమ్మిన విలువలు, విశ్వసనీయతని ఎన్నడూ చెరిపేయలేరు. ఈ చీకట్లు తాత్కాలికమే. సత్యం అనే సూర్యుడి ముందు కారుమబ్బులు వీడిపోతాయి. సంకెళ్లు నా సంకల్పాన్ని బంధించలేవు. జైలుగోడలు నా ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవు. జైలు ఊచలు నన్ను ప్రజల్నించి దూరం చేయలేవు. నేను తప్పు చేయను, చేయనివ్వను’ అని చంద్రబాబు నాయుడు లేఖలో స్పష్టం చేశారు.
అంతిమంగా న్యాయమే గెలిచేది
ఈ దసరాకి పూర్తి స్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని రాజమహేంద్రవరం మహానాడులో తాను ప్రకటించినట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు.‘అదే రాజమహేంద్రవరం జైలులో తనను ఖైదు చేశారు అని తెలిపారు. త్వరలో బయటకొచ్చి పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తాను. నా ప్రజల కోసం, వారి పిల్లల భవిష్యత్తు కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తాను అని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ బయటకు రాని నందమూరి తారకరామారావు బిడ్డ, నా భార్య భువనేశ్వరిని నేను అందుబాటులో లేని ఈ కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్లి వారి తరఫున పోరాడాలని నేను కోరాను. ఆమె అంగీకరించింది. నా అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మృతి చెందిన వారి కుటుంబాలని పరామర్శించి, అరాచక పాలనను ఎండగట్టడానికి 'నిజం గెలవాలి' అంటూ మీ ముందుకు వస్తోంది. జనమే నా బలం, జనమే నా ధైర్యం. దేశవిదేశాలలో నా కోసం రోడ్డెక్కిన ప్రజలు వివిధ రూపాల్లో మద్దతు తెలుపుతున్నారు. నా క్షేమం కోసం కుల,మత,ప్రాంతాలకు అతీతంగా మీరు చేసిన ప్రార్థనలు ఫలిస్తాయి. న్యాయం ఆలస్యం అవ్వొచ్చునేమో కానీ, అంతిమంగా గెలిచేది మాత్రం న్యాయమే. మీ అభిమానం, ఆశీస్సులతో త్వరలోనే బయటకి వస్తాను. అంతవరకూ నియంత పాలనపై శాంతియుత పోరాటం కొనసాగించండి. చెడు గెలిచినా నిలవదు, మంచి తాత్కాలికంగా ఓడినట్లు కనిపించినా కాలపరీక్షలో గెలిచి తీరుతుంది . త్వరలోనే చెడుపై మంచి విజయం సాధిస్తుంది’ అని తెలిపారు.ఈ సందర్భంగా అందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.