రాయలసీమ వాసుల చిరకాల కోరిక నెరవేర్చిన సీఎం జగన్

రాయలసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది.

Update: 2023-11-30 08:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాయలసీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. గాలేరు-నగరి సుజల స్రవంతిలో భాగంగా రూ.567.94 కోట్లతో అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన అవుకు రెండో టన్నెల్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. అవుకు రెండో టన్నెల్‌ ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి నంద్యాల జిల్లా అవుకు మండలం మెట్టుపల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, గుమ్మనూరు జయరాం, డిప్యూటీ సీఎం అంజాద్ బాషాతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, అధికారులు, వైసీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి అవుకు రెండో టన్నెల్‌ వద్దకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ తొలుత అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో గ్యాలరీని పరిశీలించారు. అనంతరం గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్‌కు 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. అనంతరం రెండో టన్నెల్‌ను జాతికి అంకితం చేస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.

సుభిక్షంగా రాయలసీమ

ఇకపోతే రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో సాగునీటిని పారించి సుభిక్షం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మరో అడుగు ముందుకేశారు. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్‌ను ప్రారంభించి జాతికి అంకితం చేశారు. తద్వారా ప్రస్తుత డిజైన్‌ మేరకు గాలేరు–నగరి వరద కాలువ ద్వారా 20 వేల క్యూసెక్కులను తరలించేందుకు మార్గం సుగమం చేశారు. అవుకు సొరంగాల పనులకు దివంగ‌త సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో రూ.340.53 కోట్లు వెచ్చించి సింహభాగం పూర్తి చేయగా 2014–19 మధ్య చంద్రబాబు సర్కారు రూ.81.55 కోట్లు మాత్రమే వ్యయం చేసి ఫాల్ట్‌ జోన్‌లో పనులు చేయకుండా చేతులెత్తేసింది. ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ రూ.145.86 కోట్లు ఖర్చు చేసి టన్నెల్‌ 2 పనులను దిగ్విజయంగా పూర్తి చేశారు. మరోవైపు టన్నెల్‌ 3 పనుల కోసం ఇప్పటివరకు మరో రూ.934 కోట్లు వెచ్చించి దాదాపు తుదిదశకు తెచ్చారు. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్‌లో ఇప్పటికే 4.526 కి.మీ. పొడవైన పనులను పూర్తి చేయడం జ‌రిగింది.

Tags:    

Similar News