CM Chandrababu:వరద బాధితులకు పరిహారం పై సీఎం చంద్రబాబు సమీక్ష

భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.

Update: 2024-09-13 10:26 GMT

దిశ, ఏపీ బ్యూరో: భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియ పై సీఎం చంద్రబాబు రివ్యూ చేశారు. సచివాలయంలో మంత్రులు, అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి ప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఎన్యుమరేషన్ పక్కాగా జరగాలని నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సాయం చేయాలని అన్నారు. సహాయ చర్యల పై ప్రజలు సంతృప్తితో ఉన్నారని పరిహారం విషయంలో శాస్త్రీయంగా ఆలోచన చేసి జాబితా రూపొందించాలని సీఎం అన్నారు. నష్టం అంచనాలు పూర్తి చేస్తే 17వ తేదీ బాధితులకు సాయం అందిద్దాం అని సీఎం పేర్కొన్నారు. ఎన్యుమరేషన్ జరుపుతున్న విధానాన్ని, వివరాలు ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు.

ఇల్లు పూర్తిగా మునిగి ఆస్తినష్టం జరిగిన వారితో పాటు మొదటి ఫ్లోర్ లో ఉన్నవారికి సైతం సాయం ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది. వరద కారణంగా ఇంట్లో వస్తువులు అన్నీ పాడైపోయిన మొదటి అంతస్తు వారికి ఒక మొత్తం, రెండో ఫ్లోర్ నుంచి ఆ పైన ఉన్నవారికి కొంత మొత్తం ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అలాగే దెబ్బతిన్న ద్విచక్ర వాహనాలకు కూడా పరిహారం ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. పూర్తిగా ఇల్లు దెబ్బతిన్న వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ఇల్లు నిర్మించి ఇవ్వనున్నారు. ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తి అయిన తరువాత ఆర్థిక సాయం పై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. వరదల కారణంగా రూ. 2,13,456 ఇళ్లు నీట మునిగి నట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇందులో ఇప్పటి వరకు 84,505 ఇళ్లలో నష్టం అంచనా లెక్కలు పూర్తి అయ్యాయి. వేలాది ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు డ్యామేజ్ అయ్యాయి. 2,14,698 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. వీటికి కూడా పరిహారం అందించనున్నారు. ఎన్యుమరేషన్ లో రీ వెరిఫికేషన్ జరిపి ప్రతి బాధితుడికి జరిగిన నష్టాన్ని సేకరిస్తున్నామని అధికారులు సిఎంకు వివరించారు. ఈ సమీక్షలో మంత్రులు వంగలపూడి అనిత, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, పి. నారాయణ, నాదెండ్ల మనోహర్ తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News