మాట ఇచ్చిన 11 రోజులకే పేద కుటుంబం కల సాకారం చేసిన చంద్రబాబు
సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ..
దిశ, ప్రతినిధి, విజయవాడ: పాములు నాయక్ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన ఎన్నికల హామీలను అత్యంత వేగవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. తాను వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలపై సైతం అంతే వేగంగా స్పందిస్తున్నారు. ఓ నిరుపేద కుటుంబానికి సొంతిల్లు కట్టిస్తానని మాటిచ్చి.. రెండు వారాలు తిరక్కుండానే ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేయుంచి మాట నిలబెట్టుకున్నారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీని సీఎం చంద్రబాబు గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలోని ఎస్టీ కాలనీ నుంచి ఈ నెల ఒకటో తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే!. నాడు కాలనీలో నివాసం వుంటున్న బాణావత్ పాములు నాయక్ ఇంటికి వెళ్లి పాములు నాయక్కు వృద్ధాప్య పింఛన్, ఆయన కుమార్తెకు వితంతు పింఛన్, భార్యకు రాజధాని పింఛన్ను స్వయంగా అందజేశారు.
అనంతరం స్టీలు గ్లాసులో వారిచ్చిన టీ తాగి కుటుంబ యోగక్షేమాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. తమకు ఇల్లు కట్టించి ఇవ్వాలని పాములు నాయక్ కుటుంబం అభ్యర్థించింది. స్పందించిన చంద్రబాబు అప్పటికప్పుడు ఇల్లు మంజూరు చేశారు. సరిగ్గా 11 రోజులకే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. సొంతింటి నిర్మాణానికి పాములు నాయక్ దంపతులు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.