చంద్రబాబు విజన్ కలిగిన నాయకుడు: మాజీమంత్రి నారాయణ
రాష్ట్రాభివృద్ధి విషయంలో విజన్ కలిగిన నాయకుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అని మాజీమంత్రి నారాయణ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రాభివృద్ధి విషయంలో విజన్ కలిగిన నాయకుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అని మాజీమంత్రి నారాయణ అన్నారు. బాబు ష్యూరిటీ - భవిష్యత్కు గ్యారెంటీ కార్యక్రమం గురించి చర్చించి, ఓటర్ల వెరిఫికేషన్లో భాగంగా దొంగ ఓట్లను వెలికితీయాలని సూచించారు. 2024లో విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త శ్రమించాలని కోరారు. నెల్లూరు నారాయణ మెడికల్ కాలేజిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి నారాయణ ముఖ్యనేతలతో సోమవారం సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి నెల్లూరు పార్లమెంట్ జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, రాష్ట్ర టీడీపీ ప్రధానకార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిలతో కలిసి ఆయన బాబు ష్యూరిటీ - భవిష్యత్కు గ్యారెంటీ కార్యక్రమ పురోగతిపై చర్చించారు. ప్రజాసంక్షేమమే ధ్యేయంగా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త నిత్యం ప్రజల్లో ఉంటూ టీడీపీ పథకాల గురించి చర్చిస్తుండాలని మాజీమంత్రి నారాయణ అన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ప్రజల్లో తిరుగుతూ టీడీపీ ప్రభుత్వం గతంలో చేపట్టిన పథకాల లబ్ధి గురించి వివరించాలని సూచించారు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకుని చంద్రబాబునాయుడును ముఖ్యమంత్రిగా, పొంగూరు నారాయణను మంత్రిగా చేసుకుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్ పిలుపునిచ్చారు. టీడీపీ శ్రేణులకు ఎల్లవేళలా పార్టీ అండగా ఉంటుందని..ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని కోరారు. టీడీపీ శ్రేణులంతా కలిసి పని చేసి రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించేలా కృషి చేయాలని టీడీపీ సీనియర్ నేత కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి సూచించారు. టీడీపీ శ్రేణులకు మాజీ మంత్రి నారాయణ అండదండ ఎల్లవేళలా ఉంటుందని...ఏ అవసరం వచ్చిన నేరుగా సంప్రదించాలని కోరారు. యువనేత నారా లోకేష్ నేతృత్వంలో విజయనగరంలో జరిగే యువగళంపాద్రయాత్ర ముగింపు సభకు నెల్లూరు నుంచి భారీగా టీడీపీ శ్రేణులు తరలివెళ్లేందుకు సన్నద్దమవుతున్నట్లు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి చెప్పారు.