AP Ex Minister: నాటి అమాత్యులకు.. కేసుల ఉచ్చు!
వాళ్లంతా వైసీపీ హయాంలో మంత్రులుగా పని చేశారు... కొన్నేళ్లపాటు హవా కొనసాగించారు.

తాజాగా మాజీమంత్రి రజినిపై ఏసీబీ కేసు
ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రుల లిస్టు పెద్దదే..
పేర్ని నాని, జోగి రమేష్, పెద్దిరెడ్డిపై కేసులు
నేడు రజినిపై.. మిగిలింది రోజా..?
రెడ్బుక్అమలు చేస్తున్నారంటే వైసీపీ ఆరోపణలు
దిశ, డైనమిక్ బ్యూరో: వాళ్లంతా వైసీపీ హయాంలో మంత్రులుగా పని చేశారు... కొన్నేళ్లపాటు హవా కొనసాగించారు. అధికారం ముసుగులో అవినీతికి పాల్పడ్డారని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు వారిపై కేసులు ఉచ్చు బిగుస్తోంది. తాజాగా వైసీపీ మాజీమంత్రి విడుదల రజినికి (Vidadala Rajani) ఏసీబీ (ACB) షాక్ ఇచ్చింది. చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలపై కేసు నమోదు అయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బాధితుడి ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. విడదల రజినితో పాటు నాటి రీజనల్ విజిలెన్స్ అధికారి ఐపీఎస్ జాషువాపైన కేసు నమోదు అయింది. ఈ కేసులో ఏ1గా విడదల రజిని, ఏ2 గా ఐపీఎస్ అధికారి జాషువా, ఏ3గా విడదల గోపి, ఏ4గా రామకృష్ణ ఉన్నారు.
రజనీపై ఆరోపణలు ఇవీ..
ఓ స్టోన్క్రషర్స్నుంచి బెదిరించి డబ్బులు వసూలు చేశారనేది ప్రధాన ఆరోపణ. యడ్లపాడు మండలంలో ఉన్న లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ (Stone crushers) యజమాని నల్లపనేని చలపతిరావు ఈ ఆరోపణ చేశాడు. తాను నిబంధనల ప్రకారమే వ్యాపారం చేస్తున్నానని, అయినా రూ.5కోట్లు లంచం ఇవ్వాలంటూ రజని తరఫున కొందరు బెదిరించారంటూ ఆయన పోలీసులను ఆశ్రయించాడు. డబ్బు ఇవ్వాలంటూ పీఏ రామకృష్ణ చేత డిమాండ్ చేయించారని పేర్కొన్నారు. అప్పటి ఎమ్మెల్యే రజని అడిగారు కాబట్టి, ఇవ్వాల్సిందేనంటూ ఎపీఎస్అధికారి జాషువా కూడా బెదిరించారని బాధితులు చెబుతున్నాడు. తాను అడ్డం తిరగడంతో మైనింగ్, రెవెన్యూ అధికారులత తన క్రషర్లో తనిఖీలు కూడా చేశారని అన్నారు. దీంతో విధి లేక. 2021లో రజిని మరిదికి గోపికి రెండు కోట్లు ఇచ్చానన్నాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక విడదల రజిని, జాషువాపై బాధితుడు చలపతి రావు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. దీనిపై మొదట విజిలెన్స్విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. విచారణ చేపట్టిన విజిలెన్స్ డబ్బులు చేతులు మారినట్లు ఆధారాలతో సహా నివేదిక ఇచ్చింది. దీంతో ఏసీబీ కేసు నమోదు చేశారు.
వైసీపీ హయాంలో పనిచేసిన మంత్రులపై..
గత వైసీపీ ప్రభుత్వంలో పని చేసిన వైసీపీ మంత్రులు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడగానే వారి లెక్క తేల్చేందుకు సిద్ధమైంది. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని (Peddireddy) ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి. మదనపల్లి భూ దస్త్రాల కేసులో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. లిక్కర్స్కాంపై కూడా ఆయన వైపే వేళ్లు చూపిస్తున్నాయి. రేషన్బియ్యం వ్యవహారంపై మాజీ మంత్రి పేర్ని నానిపై (Perni Nani) కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి కొడాలి నానికి (Kodali Nani) కూడా కేసులు వెంటాడుతున్నాయి. అప్పట్టో చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్పై కేసు నమోదైంది. విచారణకు కూడా హాజరయ్యారు. మరో మాజీమంత్రి రోజాపై (Roja) ఆడుదాం ఆంధ్రా అవినీతికి సంబంధించిన ఆరోపణలు వస్తున్నాయి. త్వరలోనే ఆమెపై కూడా కేసు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పుడు మాజీమంత్రి రజనిపై కేసు నమోదు కావడం సంచలనం రేకెత్తించింది.
రెడ్బుక్అమలు చేస్తన్నారని వైసీపీ ఆరోపణ..
గత ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారిపై కేసులు నమోదు అవుతుండడంపై వైసీపీ స్పందించింది. రాష్ర్టంలో రెడ్బుక్ (Red book) రాజ్యాంగం నడుస్తోందని ఆరోపిస్తోంది. పథకం ప్రకారం కేసుల్లో ఇరికిస్తున్నారంటోంది. అయితే పక్కా ఆధారాలతోనే చట్ట ప్రకారమే అరెస్టులు జరగుతున్నాయని కూటమి నాయకులు చెబుతున్నారు. ఎవరిపైనా కక్షసాధింపులు ఉండబోవని.. అయితే అవినీతికి పాల్పడిన వారిని వదిలిపెట్టేది లేదని సీఎం పలు సందర్భాల్లో హెచ్చరించారు.