బుడమేరులో కొట్టుకుపోయిన కారు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌

Update: 2024-09-07 16:09 GMT

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా బుడమేరు (Budameru) వరద ప్రవాహంలో శనివారం రాత్రి ఓ కారు కొట్టుకుపోయినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేసరపల్లి ఉప్పులూరు రహదారి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హైదరాబాద్‌ (Hyderabad) నుంచి సొంత గ్రామానికి వెళ్తున్న ఓ వ్యక్తి.. కారుతో సహా వాగులో కొట్టుకుపోయినట్టుగా అనుమానిస్తున్నారు. కారులో ఉన్న వ్యక్తిని పెడన గ్రామానికి చెందిన కలిదిండి ఫణిగా భావిస్తున్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి రక్షణ దళాల సహాయంతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో బుడమేరు కాల్వలో కారును గుర్తించినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే కారులో ఫణి ఉన్నాడా? లేదా కారులో నుంచి బయటకు వచ్చే ప్రయత్నంలో వాగులో కొట్టుకుపోయాడా..? అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే భారీ వర్షాల కారణంగా పొంగి పొర్లిన బుడమేరు కాలువకు గండ్లు పడడంతో విజయవాడ (Vijayawada) పూర్తిగా జలమయమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టి ఎన్డీఆర్ఎఫ్ (NDRF), ఎస్డీఆర్ఎఫ్ (SDRF), పోలీసులు (Police), అధికారులను మొహరించి గండ్లు పూడ్చివేతపై దృష్టిపెట్టడమే కాకుండా రెస్క్యూ ఆపరేషన్స్ (Rescue Operations) నిర్వహిస్తోంది. ఇక ఎట్టకేలకు బుడమేరు కాలువకు పడిన గండ్లు పూడ్చివేసిన ప్రభుత్వం ప్రస్తుతం మిగిలిన సహాయక కార్యక్రమాలపై దృష్టి సారించింది.


Similar News