ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికకు మంత్రి వర్గం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ తన నివేదికను మంత్రి వర్గానికి అందించింది.
దిశ, వెబ్డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ (Classification of SC) పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా (Retired IAS officer Rajiv Ranjan Mishra) ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ (One man commission) తన నివేదికను మంత్రి వర్గానికి అందించింది. దీనికి ఏపీ మంత్రివర్గం ఆమోదం (AP Cabinet approval) తెలిపింది. తెలంగాణలో మాదిరిగానే ఎస్సీ వర్గీకరణను ఏకసభ్య కమిషన్ మూడు కేటగిరీలుగా రూపొందించింది. గ్రూప్-1, 2, 3గా రెల్లి, మాదిగ, మాల ఉపకులాల వర్గీకరించారు. ప్రస్తుతం ఏపీ బడ్జెట్ సమావేశాలు (AP budget meetings) కొనసాగుతుండగా.. ఈ సమావేశాల్లోనే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టనున్నారు. అనంతరం ఈ బిల్లుపై సభలో ప్రత్యేకంగా చర్చించి ఆమోదం తెలిపిన తర్వాత ఈ బిల్లును కేంద్రానికి పంపనున్నారు. కాగా ఈ ఎస్సీ వర్గీకరణను మాల సామాజిక వర్గం తీవ్రంగా విభేదిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే 2024 నవంబరు 15న ఏకసభ్య కమిషన్ (One man commission)ను నియమించిన ప్రభుత్వం 2 నెలల్లోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో కమిషన్ సభ్యుడు రాజీవ్ రంజన్ మిశ్రా రాష్ట్రంలో పర్యటించి ఎస్సీ కులాల్లో ఉన్న అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. ఇందులో భాగంగా.. రాష్ట్రంలో ఉన్న ఉమ్మడి 13 జిల్లాల్లో ఎస్సీ సంఘాలు, మేధావులు, ఉద్యోగుల నుంచి ఆయన ఎస్సీ వర్గీకరణపై వినతులు సేకరించారు. దీంతో పాటుగా ఎస్సీల్లోని అన్ని ఉపకులాల నేతలు, ఉద్యోగ సంఘాలతో ఈ కమిషన్ సభ్యుడు చర్చించారు. ముఖ్యంగా ఎస్సీల్లో ఏయే వర్గాలు ప్రభుత్వ ప్రయోజనాలను సమానంగా అందలేకపోయాయనే విషయంపై కమిషన్ దృష్టి పెట్టి ఈ నివేదికను రూపొందించింది.