చంద్రబాబుకు బిగ్ రిలీఫ్: రాజకీయ కార్యకలాపాలు, ర్యాలీల్లో పాల్గొనవచ్చన్న సుప్రీంకోర్టు

స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

Update: 2023-11-28 10:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. స్కిల్ స్కాం కేసులో హైకోర్టు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్‌ మంజూరు చేయడాన్ని సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ బేలా త్రివేది , జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.ఈ కేసు విచారణలో ఇరువాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. రాజకీయ కార్యకలాపాలు, ర్యాలీల్లో చంద్రబాబు నాయుడు పాల్గొనవచ్చని సుప్రీం కోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ కేసుకు సంబంధించి డిసెంబర్ 8వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ వరకు కేసు వివరాల గురించి బహిరంగంగా ఎక్కడా మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 8కి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. 


సుప్రీంకోర్టుకు ఏపీ సీఐడీ

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని ఈ ఏడాది సెప్టెంబర్ 9న ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.ఈ కేసులో చంద్రబాబు 52 రోజులపాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే చంద్రబాబుకు అనారోగ్య కారణాల దృష్ట్యా అక్టోబర్ 31న ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఇదే కేసులో ఈ నెల 21న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఏపీ హైకోర్టు తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండానే చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేశారని సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. చంద్రబాబుకు మంజూరు చేసిన బెయిల్ ను రద్దు చేయాలని ఆ పిటిషన్ లో సీఐడీ కోరింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఆంధ్రప్రదేశ్ సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

చంద్రబాబుకు కీలక ఆదేశాలు

ఇకపోతే ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఆదేశాల ప్రకారం నేటితో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ షరతులు వర్తిస్తాయి. ఇక ఈనెల 29 నుంచి రెగ్యులర్ బెయిల్ అమల్లోకి రానుంది. చంద్రబాబు బెయిల్ రద్దు కేసు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి మాట్లాడవద్దని చంద్రబాబుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇరుపక్షాలు కూడ ఈ విషయమై మాట్లాడవద్దని ఆదేశించింది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకుండా కట్టడి చేయాలని సీఐడీ చేసిన వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మరో వైపు ఈ విషయమై ఈ నెల 8వ తేదీకి కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబుకు సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను డిసెంబర్ 8కు వాయిదా వేసింది.

Tags:    

Similar News