APCC: సీబీఐ విచారణకు పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీనే.. వైఎస్ షర్మిల ట్వీట్

Update: 2024-10-04 11:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, ఈ అంశంలో మొట్టమొదట సీబీఐ విచారణకు పట్టుబట్టింది కాంగ్రెస్ పార్టీనే అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. తిరుమల లడ్డూ కల్తీపై స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. తిరుమల లడ్డు వివాదంపై గౌరవ సుప్రీం కోర్టు స్వతంత్ర దర్యాప్తు సంస్థను నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ మనస్ఫూర్తిగా స్వాగతిస్తోందని అన్నారు. ఈ దర్యాప్తు బృందంలో సీబీఐ, ఎఫ్ఎస్ఎస్ఏఐ, రాష్ట్ర పోలీసుల ప్రతినిధులు ఉండాలని సుప్రీం కోర్టు చెప్పిందని తెలిపారు.

అలాగే లడ్డూ వివాదం బయటకు వచ్చిన రోజే కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా సీబీఐ విచారణకు పట్టుబట్టిందని, మా డిమాండులో భాగంగా కేంద్ర సర్కారుకు, రాష్ట్ర గవర్నర్ కు, ఈ అంశాన్ని సుమోటో కింద స్వీకరించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు. ఇక నేటి అత్యున్నత న్యాయస్థానం నిర్ణయంతో విచారణ నిష్పక్షపాతంగా, వేగంగా ముందుకు సాగి, లడ్డు కల్తీ విషయంలో నిజాలు బయటకు వస్తాయని కాంగ్రెస్ విశ్వసిస్తోందని అన్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఈ విషయంలో, వారందరూ కూడా నిజం కోసం వేచిచూస్తున్నారని తెలిపారు. లడ్డులో కనుక కల్తీ జరిగిందని నిరూపణ అయితే, దోషులను కఠినాతి కఠినంగా శిక్షించాలని శర్మిల కోరారు.


Similar News