ఏపీ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం.. కీలక పోస్టులన్నీ భర్తీ..!

ఏపీ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ...

Update: 2024-09-07 15:02 GMT

దిశ, వెబ్ డెస్క్: ఏపీ కాంగ్రెస్‌లో (Ap Congress) అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. పార్టీలోని కీలక పదవులన్నీ భర్తీ చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ నాయకులు రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై ఫుల్ ఫోకస్ పెట్టారు. వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికల కల్లా పార్టీ బలమైన శక్తిగా ఎదగాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాాజాగా ఏపీసీసీ కొత్త కమిటీలను (Apcc New Committees) నియమించారు. ఏపీసీసీ వైఎస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు, డీసీసీ అధ్యక్షులను నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. మొత్తం 13 మంది ఉపాధ్యక్షులు, 37 మంది జనరల్ సెక్రటరీలను, 25 మంది డీసీసీలు, ఆరుగురు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. 


కాగా ఏపీ పునర్ వ్యవస్థీకరణకు (AP Reorganization)ముందు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఉండేది. అప్పటి ఉమ్మడి ఏపీకి సీఎంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. ఆయన మరణాంతరం రోశయ్య సీఎం అయ్యారు. అయితే తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడటంతో సీనియర్ నేత కిరణ్ కుమార్‌ రెడిని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. కానీ ఉద్యమం చల్లారకపోవడంతో తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని ప్రకటించింది.

దీంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. నేతలంతా టీడీపీ (TDP), వైసీపీలోకి (YCP) చేరిపోయారు. దాంతో పార్టీ ఖాళీ అయిపోయింది. రెండుసార్లు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్  గెలవలేకపోయింది. వైఎస్ షర్మిల ఎంట్రీతోనైనా పార్టీ బలపడుతుందనుకున్నారు. ఆమె పార్టీలో చేరడం, సార్వత్రిక ఎన్నికలు జరగడం చకచకా జరిగిపోయింది. కడప నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన వైఎస్ షర్మిల (Ys Sharmila) ఘోర ఓటమి పాలయ్యారు.  వచ్చే ఎన్నికల్లోనైనా సత్తా చాటాలనే భావనతో ఆ పార్టీ అధిష్టానం.. ఏపీసీసీ కొత్త కమిటీల నియామకాన్ని చేపట్టింది. పార్టీ బలోపేతం కోసం పని చేయాలని ఈ కమిటీలకు సూచించింది.  మరి కాంగ్రెస్ హైకమాండ్ ఆశించినట్లు వచ్చే ఎన్నికల్లో బలం పెంచుకుంటారో లేదో చూడాలి. 


Similar News