వరద నీటిలో ప్రసవించిన మహిళ
గత రెండు రోజులుగా విజయవాడ నగరం వరద గుప్పిట్లో చిక్కుకుంది.
దిశ, వెబ్ డెస్క్ : గత రెండు రోజులుగా విజయవాడ నగరం వరద గుప్పిట్లో చిక్కుకుంది. నగరంలోని అజిత్ సింగ్ నగర్ కూడా పూర్తిగా వరదలో మునిగిపోయింది. కాగా అజిత్ సింగ్ నగర్లోని డాబాకొట్టు సెంటర్ ప్రాంతంలో ఓ నిండు గర్భిణీకి పురిటి నొప్పులు రాగా.. ఏం చేయాలో దిక్కు తోచని కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకునే లోపే ఆ మహిళ ప్రసవించింది. ఈ విషయం తెలుసుకున్న సీపీ రాజశేఖర్ బాబు స్వయంగా వెళ్ళి తల్లీ, బిడ్డ ఇద్దరిని బోటులో బయటికి తీసుకు వచ్చారు. అక్కడి నుండి అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు తల్లీ, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు తెలిపారు. అప్పుడే పుట్టిన పసిగుడ్డును, బాలింతను వరదనీటి నుండి సురక్షితంగా బయటికి తీసుకు వచ్చిన పోలీసు, రెస్క్యూ సిబ్బందిని ప్రజలు ప్రశంసించారు.